రన్బీర్పూర్, కత్రినాకైఫ్ ఒకప్పటి ప్రేమికులు. ఇప్పుడు మాత్రం ఇద్దరి మధ్యా 'గ్యాప్' వచ్చేసింది. ఆ గ్యాప్ అప్పుడప్పుడగూ కన్పిస్తూనే వుంది. ఇద్దరూ కలిసి 'జగ్గా జాసూస్' సినిమాలో నటించినా, సినిమా ప్రమోషన్లలో కలిసే కనిపిస్తున్నా, ఏదో ఇబ్బందికరమైన పరిస్థితి మాత్రం ఇద్దరి మధ్యా కన్పిస్తుండడం గురించి బాలీవుడ్ సినీ జనం కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. మీడియా ఈ 'గ్యాప్' మీద పెడ్తున్న స్పెషల్ ఫోకస్ నేపథ్యంలో, కొంచెం ఆ గ్యాప్ తగ్గించుకునేందుకు రన్బీర్, కత్రినా ప్రయత్నిస్తున్నట్టున్నారు.
తాజాగా, ఓ ఇంటర్వ్యూలో కత్రినా ఇష్టాయిష్టాల గురించి రన్బీర్ కపూర్ చెప్పుకొచ్చాడు. కత్రినాకైఫ్కి సినిమా నిర్మాణంపై ఆసక్తి ఎక్కువట. త్వరలో కత్రినాకైఫ్ని నిర్మాతగా చూడబోతున్నామంటూ రన్బీర్ కపూర్ వ్యాఖ్యానించినా, అక్కడే వున్న కత్రినా ఆ వ్యాఖ్యల్ని ఖండించలేదు. పైగా, రన్బీర్కి ఈ విషయంలో థ్యాంక్స్ చెప్పేసింది కత్రినా.
'ఛాన్స్ ఇస్తే, కత్రినాకైఫ్తో కలిసి సినీ నిర్మాణంలో పాలుపంచుకుంటా..' అని చెప్పాడు రన్బీర్ కపూర్. 'ష్యూర్..' అంటూ కత్రినా, రన్బీర్ ఆఫర్పై స్పందించడం గమనార్హం. 'ఇద్దరి మధ్యా గ్యాప్ ఎందుకు పెరిగింది.?' అన్న ప్రశ్నకు మాత్రం ఇటు రన్బీర్, అటు కత్రినా సమాధానమిచ్చేందుకు సుముఖత వ్యక్తం చేయలేదు. 'కొన్ని ప్రశ్నలకు సమాధానాలుండవు..' అంటూ తామిద్దరం విడిపోవడంపై కత్రినా, రన్బీర్ చెబుతోన్న విషయం విదితమే.
మొత్తమ్మీద, 'జగ్గా జాసూస్' సినిమా ప్రమోషన్స్ కోసం లేని కెమిస్ట్రీని వున్నట్లు చూపించేందుకు కత్రినా - రన్బీర్ నానా తంటాలూ పడ్తున్నారనే విషయం సుస్పష్టమిక్కడ.