జనసేన పార్టీపై ఇప్పటి వరకూ తెలుగుదేశం పార్టీ అధికారికంగా విమర్శలకు దిగలేదు. తెలుగుదేశం పార్టీ ని తమలపాకుతో కొట్టినట్టుగా పవన్ కల్యాణ్ స్పందిస్తున్నాడు కాబట్టి.. జనసేనపై కేక్ విసిరినట్టుగా తెలుగుదేశం వ్యవహరిస్తోంది. ఇటీవల రాజ్యసభలో ప్రత్యేక హోదా అంశంపై జరిగిన చర్చలో టీడీపీ ఎంపీలు పాల్గొనకపోవడాన్ని పవన్ కల్యాణ్ ట్విటర్ ద్వారా తప్పుపట్టాడు. అంతకు మించి వైకాపా ను పవన్ ప్రశంసించాడు.
అప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ బిగబట్టుకుని కూర్చుంది. ఏం మాట్లాడలేదు. పవన్ మనవాడే అన్నట్టుగా సైలెంట్ గా ఉండింది. ఆ తర్వాత మంత్రి అయ్యన్న పాత్రుడు ఈ తీరును ధ్రువీకరించాడు. జనసేన, తెలుగుదేశం, బీజేపీలు వచ్చే ఎన్నికల్లోకలిసి పోటీ చేస్తాయని ఆయన వ్యాఖ్యానించాడు.
ఇలాంటి నేపథ్యంలో మరో తెలుగుదేశం నేత శత్రుచర్ల విజయరామరాజు మాత్రం జనసేనపై హాట్ కామెంట్స్ చేశారు. జనసేనను మూడు గంటల్లో ముగిసిపోయే సినిమా అని ఆయన విమర్శించారు. పవన్ కల్యాణ్ సినిమాలు మూడు గంటల పాటు చూడటానికి బాగుంటాయి, జనసేన కూడా అలాంటిదే.. అని శత్రుచర్ల వ్యాఖ్యానించాడు. మరి తెలుగుదేశం పార్టీ నుంచి పవన్ పై అధికారికంగా ఇంత వరకూ ఎలాంటి విమర్శలూ రానప్పటికీ..శత్రుచర్ల ఈ విధంగా మాట్లాడటం ఆసక్తికరంగా ఉంది. మరి ఈ వ్యాఖ్యలను టీడీపీనే ఖండిస్తుంది కాబోలు!