అందరూ బాగుండాలి.. అందులో మేముండాలి.!

శర్వానంద్‌ హీరోగా తెరకెక్కిన 'శతమానంభవతి' ఈ నెల 14వ తేదీన విడుదల కానున్న విషయం విదితమే. దిల్‌ రాజు నిర్మించిన ఈ సినిమాలో శర్వానంద్‌ సరసన 'అఆ' ఫేం అనుపమ పరమేశ్వరన్‌ హీరోయిన్‌గా నటించింది. సంక్రాంతి సీజన్‌లో పెద్ద సినిమాలతోపాటు రేసులో నిలబడ్డాడు శర్వానంద్‌ 'శతమానంభవతి' సినిమాతో. గత ఏడాది నాలుగు సినిమాలొచ్చాయనీ, అందులో తనదీ ఒకటుందనీ, ఈ ఏడాది కూడా అదే సెంటిమెంట్‌ కొనసాగుతుందని శర్వానంద్‌ చెప్పుకొచ్చాడు. 

సినిమా కాన్సెప్ట్‌ 'అందరూ బాగుండాలి.. ఆ సంతోషంలో మేమూ భాగమవ్వాలి..' అనీ, సంక్రాంతి సందర్భంగా విడుదలైన అన్ని సినిమాలూ బాగుండాలనీ, అలా బాగుండే సినిమాల్లో తమది కూడా ఒకటి అవ్వాలన్నదే తమ ఉద్దేశ్యమన్నాడు శర్వానంద్‌. 11వ తేదీన చిరంజీవి హీరోగా నటించిన 'ఖైదీ నెంబర్‌ 150' సినిమా విడుదలవడం, 12వ తేదీన బాలకృష్ణ హీరోగా నటించిన 'గౌతమి పుత్ర శాతకర్ణి' సినిమా విడుదలవడం తెల్సిన విషయాలే. 

రెండు పెద్ద సినిమాలు, పైగా అత్యంత ప్రతిష్టాత్మక సినిమాలు.. అందునా చిరంజీవికీ, బాలకృష్ణకీ ల్యాండ్‌ మార్క్‌ సినిమాలు విడుదలవుతున్న దరిమిలా, ఈ సందట్లో చిన్న సినిమాల గురించి ఎవరు పట్టించుకుంటారు.? అన్న చర్చ జరుగుతోంది. అయితే, గత ఏడాదీ సైలెంటుగా వచ్చి 'ఎక్స్‌ప్రెస్‌రాజా'తో హిట్టు కొట్టేశాడు శర్వానంద్‌. అదే సెంటిమెంట్‌ ఈసారీ వర్కవుటవుతుందన్నది శర్వానంద్‌ ధీమా. సినిమా సంగతి పక్కన పెడితే, 'అందరూ బాగుండాలి.. ఆ సంతోషంలో మేమూ వుండాలి..' అన్న శర్వానంద్‌ కాన్సెప్ట్‌కి మాత్రం హేట్సాఫ్‌ చెప్పాల్సిందే.

Show comments