చరణ్‌ అందర్నీ కవర్‌ చేసేశాడు.!

సోషల్‌ మీడియాలో రామ్‌చరణ్‌ సరికొత్త ట్రెండ్‌కి తెరలేపాడు. అభిమానులతో లైవ్‌లో పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చాడు. చిరంజీవి చేస్తోన్న కొత్త సినిమా గురించీ, తాను చేస్తోన్న 'ధృవ' సినిమా గురించీ మాట్లాడాడు. అంతే కాదు, మహేష్‌ గురించీ, ప్రభాస్‌ గురించీ అభిమానుల ప్రశ్నలకు సమాధానాలిచ్చి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. 

వున్నపళంగా రామ్‌చరణ్‌ అభిమానుల ముందుకు సోషల్‌ మీడియా ద్వారా రావాలనుకోవడానికి కారణమేంటట.? తెరవెనుక పెద్ద స్కెచ్చే వుండి వుంటుంది. అదేమిటన్నది ప్రస్తుతానికి సస్పెన్సే. చరణ్‌కి, ప్రభాస్‌ స్నేహితుడట. 'బాహుబలి' సెట్స్‌కి ఇటీవల వెళ్ళి వచ్చాడట. మహేష్‌ హ్యాండ్సమ్‌.. అని చెప్పాడు. పవన్‌కళ్యాణ్‌తో వచ్చే ఏడాది సినిమా వుంటుందన్నాడు. వారెవ్వా రామ్‌చరణ్‌ దాదాపుగా అందర్నీ కవర్‌ చేసేశాడన్నమాట. 

పవన్‌కళ్యాణ్‌ నిర్మాతగా, చరణ్‌ హీరోగా ఓ సినిమా రానుందని అప్పట్లో ప్రచారం జరిగింది. పవన్‌ కాస్త ఖాళీ అయితే, ఈలోగా రామ్‌చరణ్‌ కూడా కొంచెం తీరిక చూసుకుని, ఆ సినిమా మీద ఫోకస్‌ పెడ్తారట. ఇది మెగా అభిమానులకు పండగ లాంటి వార్తే. అయితే పవన్‌ ఎప్పుడు ఖాళీ అవ్వాలి.? రామ్‌చరణ్‌ ఎప్పుడు తీరిక చేసుకోవాలి.? చరణ్‌ సినిమా ఫంక్షన్లకు రావడానికే పవన్‌కి తీరిక దొరకడంలేదాయె.! 

ఇక, 'ధృవ' ఫస్ట్‌ లుక్‌ని ఆగస్ట్‌ 15న విడుదల చేసే అవకాశముందని చరణ్‌ చెప్పుకొచ్చాడు. చిరంజీవి సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతోందనీ, ఆ సినిమాలో తాను నటించే విషయమై ఇంకా క్లారిటీ లేదనీ, వినాయక్‌తోపాటు చిరంజీవి అనుకుంటే ఏదో పాటలోనో, ఓ సీన్‌లోనో కాస్సేపు కన్పిస్తే కన్పించొచ్చన్నాడు చరణ్‌. 

మొత్తమ్మీద, చరణ్‌ అభిమానులతో ముచ్చటిస్తూ చాలా విషయాలే చెప్పేశాడు. 'ధృవ' టైటిల్‌ విషయమై ఇప్పటిదాకా కాస్తంత గందరగోళం కన్పిస్తూ వచ్చింది. చరణ్‌ మాటలతో ఆ టైటిల్‌ పక్కా.. అన్న క్లారిటీ వచ్చిందిప్పుడు. 'కత్తిలాంటోడు' టైటిల్‌ మాత్రం కాదని చిరంజీవి సినిమా టైటిల్‌ విషయమై క్లారిటీ ఇచ్చేశాడు చరణ్‌.

Show comments