అక్కినేని నాగార్జున.. సస్పెన్స్ కొనసాగిస్తున్నాడు!

తనయుల వివాహం విషయంలో సస్పెన్స్ ను కొనసాగిస్తున్నాడు అక్కినేని నాగార్జున. రోజులు దాటి నెలలు గడుస్తున్నాయి… అక్కినేని నాగచైతన్య, అఖిల్ ల పెళ్లిల విషయంలో పుకార్లు, వార్తలు ఊపందుకుని. అఖిల్ విషయంలో కాదు కానీ, ప్రత్యేకించి చైతన్య విషయంలోనే.. అందరికీ ఎనలేని ఆసక్తి. నాగచైతన్య కూడా హైదరాబాద్ లో ఎవరో పేరెన్నిక గల  వ్యాపార వేత్త కూతురిని పెళ్లి చేసుకొంటాడనే వార్తలు వచ్చి ఉంటే.. దానిపై మీడియాకు పెద్దగా ఆసక్తి ఉండేది కాదు. సమంతను వివాహం చేసుకొంటాడంటేనే.. సగం మంది అవాక్కవుతున్నారు, మిగిలిన వాళ్లు ఆశ్చర్యపోతున్నారు.

ఒక దశలో పుకారుగా.. మరి కొంత కాలానికి దాదాపు ధ్రువీకరణ అయిన అంశంగా మారిన ఈ వ్యవహారం నాగార్జున ఇప్పుడు మరోసారి స్పందించాడు. వేరే కార్యక్రమంలో పాల్గొన్న ఆయన తనయుల పెళ్లిపై ఎదురైన ప్రశ్నపై స్పందిస్తూ సస్పెన్స్ ను కొనసాగించాడు.

మంచి సందర్భంలో ఆ విషయాన్ని ప్రకటిస్తామని నాగార్జున అన్నాడు. ఇప్పుడు కాదు.. మంచి ముహూర్తంలో ప్రకటన చేస్తానన్నట్టుగా నాగ్ ఆ అంశంపై స్పందించాడు.

ఇది వరకూ కూడా తనయుల వివాహాల గురించి నాగ్ స్పందించాడు. వారి ఎంపికను కాదనలేమన్నట్టుగా మాట్లాడాడు. అయితే కోడళ్లెవరు? అనే అంశం గురించి మాత్రం నాగ్ సస్పెన్స్ కొనసాగిస్తున్నాడు. సమంతను కోడలిగా చేసుకోబోతున్నామని ఎక్కడా ప్రకటన చేయలేదు.

ఇటీవల నిమ్మగడ్డ ప్రసాద్ కూతురు వివాహానికి సమంత అక్కినేని కుటుంబంతో పాటు హాజరు కావడం.. వారి కుటుంబ సభ్యురాలిలా కలిసిపోవడం తో చైతూతో ఆమె పెళ్లి గురించి ఊహాగానాలకు మరింత ఊతం లభించింది. మరి ఈ వ్యవహరాన్ని అక్కినేని ముహూర్తం ధ్రువీకరించే ముహూర్తం ఎప్పుడో!

Show comments