చంద్రబాబుకు వదిన గారి దెప్పిపొడుపు..!

తెలుగుదేశం అధినేత ,ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తన సచ్ఛీలాన్ని నిరూపించుకోవాల్సింది అని వ్యాఖ్యానించారు మాజీ కేంద్రమంత్రి, ప్రస్తుత బీజేపీ నేత పురందేశ్వరి. బాబు మంచి అవకాశాన్ని కోల్పోయాడని ఆమె వ్యాఖ్యానించడం విశేషం . ఓటుకు నోటు కేసు విషయంలో ఏసీబీ విచారణను త్వరిత గతిన పూర్తి చేయాలన్న కోర్టు ఆదేశాల పై బాబు స్టే తెచ్చుకున్న నేపథ్యంలో పురందేశ్వరి ఈ వ్యాఖ్యానాలు చేశారు.

ఒకవైపు స్టే విషయంలో తెలుగుదేశం పార్టీ ఉక్కిరి బిక్కిరి అవుతోంది. బాబు చరిత్ర అంత స్టే ల మయం అయిన నేపథ్యంలో ప్రత్యర్థులు బాబుపై దుమ్మెత్తి పోస్తున్నారు. నిప్పును పప్పును అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు.. ఎందుకు స్టే తెచ్చుకుని విచారణను నిలిపేయించుకున్నాడు? అని ప్రత్యర్థులు సంధిస్తున్న ప్రశ్నలపై తెలుగుదేశం ఎదురుదాడి చేయవచ్చు గాక! నైతికంగా మాత్రం ఈ విషయం ఇబ్బంది పెట్టేదే!

అసలు నైతిక విలువలు పాటించే వారికి కదా.. ఆ ఇబ్బంది అంటారా! దానికేం చేయలేం.  చంద్రబాబు నాయుడు విచారణను ఎదుర్కొనాల్సింది అని.. ఆ విచారణ లో ఆయన నిర్దోషిగా బయటకు వచ్చి.. తన నిజాయితీని నిరూపించుకోవాల్సిందని, అయితే ఆయన ఈ అవకాశాన్ని కోల్పోయాడని.. పురందేశ్వరి వ్యాఖ్యానించారు. బాబు స్టే తెచ్చుకోవాల్సింది కాదని అమె అన్నారు. మరి సొంత వదిన, మిత్రపక్ష పార్టీ నేత అయిన పురందేశ్వరి బాబుకు ఈ తరహా సూచన ఇచ్చారు.. మరి దీని తెలుగుదేశం వీరాభిమానులు ఏమంటారో!

Show comments