టీడీపీలో పెరిగిన లోకేశ్ ప్రాధాన్యం...శ్రేణుల్లో క‌ల‌వ‌రం!

వైసీపీ ప్ర‌భుత్వంపై వ్య‌తిరేక‌త‌ను సొమ్ము చేసుకోవాల్సిన ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ, అందుకు విరుద్ధంగా బ‌ల‌హీన‌ప‌డుతోంది. ఇది ఆ పార్టీని ఆందోళ‌న‌కు గురి చేస్తోంది. ఒక‌వైపు వైసీపీ ప్ర‌భుత్వంపై వ్య‌తిరేక‌త ఉంద‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతున్న‌ప్ప‌టికీ, మ‌రోవైపు టీడీపీ బ‌లోపేతం కాక‌పోవ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది. ఈ నేప‌థ్యంలో రానున్న ఎన్నిక‌ల్లో అధికారం ఎవ‌ర‌ద‌నే ప్ర‌శ్న‌కు... స్ప‌ష్ట‌మైన స‌మాధానం చెప్ప‌లేని ప‌రిస్థితి.

మ‌రీ ముఖ్యంగా లోకేశ్ పాద‌యాత్ర మొద‌లు పెట్టిన‌ప్ప‌టి నుంచి టీడీపీ మ‌రింత బ‌ల‌హీన‌ప‌డుతోంద‌నే టాక్ అంత‌కంత‌కూ పెరుగుతోంది. ఈ రాజ‌కీయ వాతావ‌ర‌ణంపై టీడీపీ నేత‌లు క‌ల‌వ‌ర‌ప‌డుతున్నారు. ఈ ద‌ఫా అధికారంలోకి రాక‌పోతే, ఇక టీడీపీని మ‌రిచిపోవ‌చ్చ‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఎందుకిలా జ‌రుగుతోంద‌నే అంత‌ర్మ‌థ‌నం ఆ పార్టీలో జ‌రుగుతోంది. టీడీపీ రోజురోజుకూ బ‌ల‌హీన‌ప‌డుతోంద‌నే ప్ర‌చారం రావ‌డానికి ప్ర‌ధాన కార‌ణం మ‌రెక్క‌డో లేదు.

ఆ పార్టీకి జంట నాయ‌క‌త్వ‌మే అడ్డంకిగా మారింది. టీడీపీలో లోకేశ్ జోక్యం పెరిగింది. టికెట్లు ఎవ‌రికి ఇవ్వాలి, అలాగే పార్టీ ప‌ద‌వుల్లో ఎవ‌రిని నియ‌మించాల‌నే విష‌య‌మై లోకేశ్ అభిప్రాయం కీల‌కంగా మారింది. ఒక‌ప్పుడు చంద్ర‌బాబు మాత్ర‌మే అన్నీ తానై పార్టీని న‌డిపించేవారు. అంద‌రి గురించి ఆయ‌న‌కు బాగా తెలిసి వుండ‌డంతో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేది. కానీ లోకేశ్ చొర‌బాటు పెరిగిన త‌ర్వాత టీడీపీ ప‌త‌నమ‌వుతోంద‌న్న ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది.

ఉదాహ‌ర‌ణ‌కు పాద‌యాత్ర చేస్తున్న లోకేశ్ కొన్ని చోట్ల అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టిస్తున్నారు. అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించ‌ని నియోజ‌క‌వ‌ర్గాల్లో ఇన్‌చార్జ్‌ల్లో స‌హ‌జంగానే త‌మ‌కు టికెట్ ద‌క్క‌ద‌నే అనుమానం త‌లెత్తుతోంది. దీంతో వారు పార్టీ కోసం నిబ‌ద్ధ‌త‌తో ప‌ని చేసే ప‌రిస్థితి లేదు. మ‌రెవ‌రికో టికెట్ ఇచ్చే ప‌రిస్థితి ఉన్న‌ప్పుడు, అన‌వ‌స‌రంగా డ‌బ్బు ఖ‌ర్చు పెట్టి పోగొట్టుకోవ‌డం ఎందుక‌నే అభిప్రాయానికి వ‌స్తున్నారు. ఈ ధోర‌ణి పార్టీని బ‌ల‌హీన‌ప‌రుస్తోంది. లోకేశ్ తీరు టీడీపీకి లాభం కంటే న‌ష్ట‌మే ఎక్కువ‌ని సొంత పార్టీ నేత‌లు అంటున్నారు.

టీడీపీలో లోకేశ్ ప్రాధాన్యం పెర‌గ‌డంతో కొంద‌రు లాబీయిస్టులు టికెట్లు పొందేందుకు సులువైన మార్గాన్ని ఎంచుకుంటున్నారు. చంద్ర‌బాబును న‌మ్ముకుంటే చేతికి చిప్ప మిగులుతుంద‌ని, ఇదే లోకేశ్ గుడ్‌లుక్స్‌లో ప‌డితే టికెట్‌, ఇత‌ర ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయ‌నే భావ‌న పెరుగుతోంది. దీంతో క్షేత్ర‌స్థాయిలో ప్ర‌జానీకంతో ఏ మాత్రం సంబంధం లేని నాయ‌కులు లోకేశ్ మ‌నుషులుగా గుర్తింపు తెచ్చుకుంటూ ల‌బ్ధి పొందుతున్నార‌ని చెప్పొచ్చు. 

టీడీపీలో చోటు చేసుకుంటున్న ఈ ప‌రిణామాల‌పై సీనియ‌ర్ నేత‌లు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇలాగైతే టీడీపీ పూడ్చుకోలేనంత‌గా న‌ష్ట‌పోతుంద‌ని వాపోతున్నారు.

Show comments