పవన్-త్రివిక్రమ్ ఓ వేదికపైకి రారు?

టాలీవుడ్ లో అపూర్వ స్నేహితులు అంటూ జాబితా తీస్తే అందులో పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ శ్రీనివాస్ ల పేర్లు కచ్చితంగా వుంటాయి. ఆ ఇద్దరి మధ్య అంతటి సౌన్ని హిత్యం వుంది. అందులో సందేహం లేదు. 

పవన్ దేవుడు అయితే త్రివిక్రమ్ పూజారి. పవన్ హీరో అయితే త్రివిక్రమ్ అతనికి అన్నీ తానై వ్యవహరిస్తారు. పవన్ కు ఏదైనా చెప్పాలంటే త్రివిక్రమ్ నే దారి. పవన్ తో సినిమా సెట్ కావాలన్నా త్రివిక్రమ్ నే దారి. పీపుల్స్ మీడియా సినిమా అయినా, దానయ్య సినిమా అయినా సెట్ చేసింది త్రివిక్రమ్ నే. సముద్రఖని అయినా, సుజిత్ అయినా వెళ్లింది త్రివిక్రమ్ ద్వారానే. అంతకు ముందు వకీల్ సాబ్ సెట్ చేసింది ఆయనే. భీమ్లానాయక్ కు తెరవెనుక అన్నీ తానే అయింది త్రివిక్రమ్ నే.

కానీ అలాంటి త్రివిక్రమ్ కొన్నాళ్ల వరకు అంటే మహేష్ తో చేస్తున్న సినిమా పూర్తయ్యే వరకు పవన్ తో కలిసి ఓ వేదిక మీద కనిపించరు అనే వార్తలు ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతున్నాయి. ఆహా లో అన్ స్టాపుబుల్ షోకు కు త్రివిక్రమ్ ను పవన్ తో కలిసి రమ్మని బాలయ్య ఫోన్ లో ఆర్డరేసారు. అలాగే అన్నారు. ఆహా తరపున త్రివిక్రమ్ నే పవన్ ను ఒప్పించారు. కానీ షో కి తనను కాకుండా క్రిష్ ను తీసుకెళ్లమని సలహా ఇచ్చారు. తాను షో వరకు వెళ్లి, అది అయ్యే వరకు కేరవాన్ లో కూర్చున్నారు. అంతే తప్ప వేదిక మీద ప్రత్యక్షం కాలేదు.

మొన్నటికి మొన్న సర్ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ ప్లాన్ చేసారు. త్రివిక్రమ్ నిర్మాణ భాగస్వామి. పవన్ ఈ ఫంక్షన్ కు వస్తారని అంతా అనుకున్నారు. ముందుగా ఫీలర్లు కూడా వినిపించాయి. కానీ గెస్ట్ లేకుండానే ఫంక్షన్ కానిచ్చారు. కారణం పవన్-తాను ఓ వేదిక మీద కలిసి కనిపించడం ఇప్పుడు సరికాదని త్రివిక్రమ్ అనుకోవడమే అని ఇన్ సైడ్ వర్గాల బోగట్టా. పవన్ ను కాకుండా ఆ రేంజ్ లో మరెవరినీ పిలవడం కూడా త్రివిక్రమ్ కు అంత ఇష్టం లేకపోయిందని గుసగుసలు వినిపిస్తున్నాయి.

పవన్ సినిమా పనుల మీద బిజీ అయిపోయి త్రివిక్రమ్ తన సినిమాను కాస్త అలక్ష్యం చేస్తున్నారనే ఫీలింగ్ లో మహేష్ వున్నారని ఆ మధ్య అక్కడ అక్కడ వార్తలు వచ్చాయి. ఆ తరువాత కథ మొత్తం పక్కన పెట్టారు. చేసిన షూటింగ్ ఫుటేజ్ మొత్తం పక్కన పడేసారు. కొత్త స్క్రిప్ట్ తయారు చేస్తే తప్ప సెట్ మీదకు వెళ్లలేదు. అందుకే ఇకపై ఎలాంటి డిస్ట్రబెన్స్ లేకుండా మహేష్ సినిమా అయ్యే వరకు త్రివిక్రమ్ ఏ ఓపెన్ డయాస్ మీద పవన్ తో కలిసి కనిపించరు అనే టాక్ బలంగా వినిపిస్తోంది టాలీవుడ్ లో.

Show comments