వైసీపీ ఎమ్మెల్యేల విషయంలో బీజేపీ ఛాలెంజ్!

మేము లేకపోతే మీకు దిక్కులేదు.. కనీసం డిపాజిట్లు కూడా దక్కించుకోలేరు..అని తెలుగుదేశం నేతలు సవాలు చేస్తే, దమ్ముంటే ఫిరాయింపు ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించాలని బీజేపీ నేతలు తెలుగుదేశం నేతలకు ప్రతి సవాలు చేశారు. ప్రత్యేక హోదా అంశం విషయంలో ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో కత్తులు దూసుకొంటున్నామని కలరిస్తున్నారు కమలనాథులు, పచ్చపార్టీ నేతలు.. ఒకరి వీక్ నెస్ పాయింట్లను మరొకరు హైలెట్ చేసుకుంటున్నారు.

ఇన్ని రోజులూ వైసీపీ ఎమ్మెల్యేల, ఎంపీల జంపింగ్ విషయంలో కమలనాథులు మారు మాట్లాడలేదు! ఈ విషయం తమకు సంబంధించింది కాదన్నట్టుగా వ్యవహరించారు. అయితే తెలుగుదేశం వాళ్లు తమను అంటున్న మాటలను, డిపాజిట్లు దక్కించుకోలేరు.. అని అంటూ తమపై ధ్వజమెత్తుతున్న తీరుతో కమలం వారు సహించలేకపోతున్నారు. ఫిరాయింపుల అంశాన్ని వీరు ప్రస్తావిస్తున్నారు. తెలుగుదేశానికి దమ్ముంటే ఆ ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించాలని.. తమ సత్తా ఏమిటో చూపుతామని కమలనాథులు అంటున్నారు.

అయితే.. ఇవన్నీ జరిగేవి కాదని అందరికీ తెలిసిందే. ప్రత్యేక హోదా అంశాన్ని పక్కదారి పట్టించేయాలి..  ఏదో జరుగుతున్నట్టుగా ప్రజలకు భ్రమలు కలిగించాలి. ప్రజా ప్రయోజనాలతో ముడిపడిన ప్రత్యేక హోదా అంశం గురించి.. ఇలాంటి రాజకీయం చేస్తూ పొద్దు పుచ్చుతున్నారు!

ఇదే సందర్భంలో బీజేపీ నేతలు టీవీ షోల్లో తెలుగుదేశం అధినేతకు ఒక ప్రశ్న వేస్తున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ముప్పై సార్లకు పైనే ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు ఎన్ని సార్లు మోడీకి ప్రత్యేక హోదా విషయంలో విజ్ఞప్తి చేశారో చెప్పాలని కమలనాథులు ప్రశ్నిస్తున్నారు. ప్రత్యేక  హోదా విషయంలో చంద్రబాబు పలుసార్లు మాట మార్చడాన్ని వీరు గుర్తు చేస్తున్నారు.

Show comments