అర్రీబుర్రీ మోడీ భక్తుడు చెప్పిన మాటే కాదు అది.. ఏకంగా కేంద్ర మంత్రి ఒకరు కూడా పాకిస్తాన్ కు ఒక ఉచిత సలహా ఇచ్చారు. మేం కొత్త నోట్లు ముద్రేస్తున్నాం.. దీనికి నకిలీని తయారు చేయడం మీ తరం కాదు, కరాచీలో భారత కరెన్సీకి దొంగనోట్లను ముద్రించే ప్రెస్ ను ఇక మీరు మూతేసుకోండి. దాన్ని నడపడం ఇక జీతాలు దండగ! అని.. కేంద్రమంత్రి ఒకరు వ్యాఖ్యానించారు!
నోట్ల రద్దును సమర్థించుకోవడానికి పాకిస్తాన్ బూచిని ఆ విధంగా చూపించి.. దేశ జనుల రోమాలు నిక్కబొడుచుకునిపించే యత్నం చేశారు. ఇక దాన్ని పట్టుకుని.. మోడీ భక్తులు ఊగిపోయారు! కళ్ల నిండా నీళ్లు పెట్టుకుని.. ఎంత అదృష్టవంతులం మనం .. అంటూ భావోద్వేగపూరితం అయిపోయారు. చూశారా.. మోడీ నిర్ణయంతో ఇక దొంగ నోట్ల తయారి ఉండదు, అంతకు మించి పాక్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది! అంటూ.. చిడతలు అందుకున్నారు!
కట్ చేస్తే.. గుంటూరులో ఏటీఎంలో నకిలీ ఐదొందల రూపాయల నోట్లు! ఏ నోటుకైతే నకిలీని పుట్టించడం బ్రహ్మతరం కూడా కాదు అన్నారో.. ఏ నోటును అయితే మోడీ విజన్ మేరకు, అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి తయారు చేశారని భక్తులు డప్పేశారో.. అవే నోట్లకే దొంగ నోట్ల ను తయారు చేయడం, వాటిని మారకంలోకి తీసుకురావడం.. అలా వచ్చిన దొంగ నోట్లను గుర్తించడం జరిగిపోయింది!
మరి దొంగ నోట్లనైతే గుర్తించారు కదా.. ఇది కూడా మోడీ ఘనతే కదా.. అంటూ ఇప్పుడు మళ్లీ చిడతలు అందుకునేందుకు భక్తులు రెడీగా ఉండొచ్చు గాక! అప్పుడు అలా చెప్పారు.. అప్పుడే దొంగ నోట్లు వచ్చేశాయే? అని అడిగితే, అలా అడిగిన వారి మీద దేశద్రోహ నేరం మోపం వచ్చు గాక!