కాంగ్రెస్ పార్టీని తెలుగు రాష్ట్రాల్లో పాతరేసింది ఎవరు.? అంటే, ఠక్కున వచ్చే సమాధానం కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ అనే. ఉమ్మడి తెలుగు రాష్ట్రం విభజన సందర్భంగా, కాంగ్రెస్ అధిష్టానం 'ప్రయోగించిన రాజకీయాలు' ఎలా వున్నా, ఈ క్రమంలో డిగ్గీరాజా చేసిన ఓవరాక్షన్ దెబ్బకి, తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ దారుణంగా దెబ్బతినేసింది. తెలంగాణలో కాస్తో కూస్తో ఉనికిని కాపాడుకున్నా, ఎన్నికలయ్యాక.. దాన్నీ నాశనం చేసేసిన ఘనత డిగ్గీరాజాకే దక్కుతుంది.
ఈసారి, డిగ్గీరాజా గోవాలో కాంగ్రెస్ పార్టీకి పాతరేసేశారు. అక్కడి ఎన్నికల వ్యవహారాల్ని పార్టీ పరంగా పర్యవేక్షించిన దిగ్విజయ్సింగ్, మెజార్టీ సీట్లు వచ్చినా.. ప్రభుత్వ ఏర్పాటు దిశగా మాత్రం పావులు కదపలేకపోయారు. డిగ్గీరాజా ప్రదర్శించిన నిర్లక్ష్యం పుణ్యమా అని, 17 సీట్లు సాధించినా కాంగ్రెస్కి అధికారం దక్కలేదు. 13 సీట్లు దక్కించుకున్న బీజేపీ తెలివిగా అధికార పీఠమెక్కింది.
బీజేపీ దిక్కుమాలిన రాజకీయాలు ప్రయోగించిన మాట వాస్తవమే అయినా, ఇక్కడ కాంగ్రెస్ నిర్లక్ష్యం సుస్పష్టం. ఈ వ్యవహారంపై ఇప్పుడు తాపీగా దిగ్విజయ్సింగ్, 'తనకే పాపం తెలియదు' అంటూ వాపోతున్నాడు. 'మాకు మేమే పార్టీని నాశనం చేసుకున్నాం.. నేను చెబితే ఎవరూ విన్లేదు.. పొత్తుల విషయంలో నా నిర్ణయాలకు విలువ లేకుండా పోయింది. ఇప్పుడు నా మీద ఆరోపణలు చేస్తే ఎలా.?' అంటూ ఆయన గుస్సా అవుతున్నాడు.
మొదటినుంచీ దిగ్విజయ్సింగ్ వ్యవహారశైలి అనుమానాస్పదమే. కాంగ్రెస్ పార్టీలోనే వుంటూ, ఆ పార్టీకి వెన్నుపోటు పొడవడంలో దిగ్విజయ్ రూటే సెపరేటు. అయినా, ఆయన ఎఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీకి అత్యంత సన్నిహితుడు, నమ్మకస్తుడు కూడా. నమ్మకం వున్నచోటే కదా, వెన్నుపోటుకి ఆస్కారముంటుంది. దిగ్విజయ్ చేస్తోన్నది అదే మరి.