మనవడి అక్షరాభ్యాషాన్ని కూడా రాజకీయ లబ్ధి కోసం వాడుకోవడం రాజకీయాల్లో నిప్పు అని చెప్పుకునే చంద్రబాబుకే చెల్లింది. అక్షరాభ్యాషం అంటే ఎవరైనా ఏం రాయిస్తారండీ.. అ అమ్మ.. ఆ ఆవు.. ఇ.. ఇళ్లు.. ఇలా పసిపిల్లలకు నోరు తిరిగే రెండు అక్షరాల పదాలు పలికిస్తారు. మరి ఆయన సీఎం మనవడు కదా అందరి లాగా పుట్టగానే రెండు అక్షరాలు పలికితే మిగతా పిల్లలకు మనకు తేడా ఏముంటుంది అనుకున్నాడో ఏమో మన నిప్పు ముఖ్యమంత్రి మూడేళ్ల పిల్లోడి చేత ఏకంగా ఆంధ్రప్రదేశ్, అమెరికా, అమరావతి అంటూ.. ఆ పసివాడికి నోరు కూడా తిరగని పదాలు రాయించి, దాన్ని కూడా పబ్లిసిటీ స్టంట్గా మార్చి కాదేదీ ప్రచారానికి అనర్హం అన్నట్టు వ్యవహరించాడు.
నలుగురు కుటుంబ సభ్యుల మధ్య సింపుల్ గా జరుపుకునే అక్షరాభ్యాసాన్ని తిరుమల కొండ మీద గొప్ప వేడుగా నిర్వహించి అధికార దర్పాన్ని చాటుకున్నాడు. దానికి తోడు ఆ పసిగుడ్డు చేత అవేంటో కూడా తెలుసుకోలేని పదాలు పలికించాడు. చిన్నప్పుడు అ అంటే అమ్మ అని పలికించి పక్కన అమ్మను, ఆ అంటే అవు అని పలికించి ఆవును చూపిస్తాం. మరి ఈయన గారు మనవడి చేత ఆ అంటే ఆదాయం, ఆంధ్రప్రదేశ్ అని నోరుతిరగని పదాలు పలికించి ఏం చూపించారు. ప్రచార యావకు పరాకాష్ట కాకపోతే చిన్నపిల్లలతో కూడా రాజకీయమేనా అని సొంత పార్టీ నేతలు చంద్రబాబు రాజకీయాలను విసుక్కుంటున్నారు.
ఇక అక్షరాలు దిద్దించే బలపానికి కూడా వెండితొడుగు తొడగడంపై కూడా విమర్శలు వస్తున్నాయి. చేతికి గడియారం లేదు, వేలికి ఉంగరం లేదంటూ సింప్లిసిటీ నటించే చంద్రబాబు మరి మనవడి బలపానికి వెండి తొడుగు ఎందుకు తొడిగినట్టు అని ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. పలక, బలపం విద్యాభ్యాషం ఆరంభానికి శుభ చిహ్నాలు. అందుకే పెన్ను, పెన్సిల్ బదులుగా బలపంతో తొలి అక్షరాలు దిద్దించడం ఆనవాయితీ. రేపటి నుంచి దేవాన్ష్ ఇంటర్నేషనల్ స్కూళ్లో ఏసీ గదుల్లో చదవొచ్చుగాక కానీ బలపంతో అయితే రాయడుగా.
మరి అక్షరాభ్యాసం రోజు వెండి బలపం ఏంటి అధికార దర్పం కాకపోతే అన్న విమర్శలొస్తున్నాయి. ఇక చంద్రబాబు ఉంగరాలు, గడియారాల సంగతి చెప్పుకుంటే ఆయనకున్న దీర్ఘకాల చర్మవ్యాధి కారణంగా అవి ధరిస్తే అలర్జీ ఏర్పడి దురద పుడుతుంది. అందుకే చంద్రబాబు ఒంటిపై ఎలాంటి ఆభరణాలు ధరించడు. మెడచుట్టూ, చేతులుపై కూడా తెల్లటి పౌడర్ కనిపిస్తుంది. ప్రతిరోజు బాబు నాలుగు జతల బట్టలు మారుస్తాడు అనేది రాజకీయ వర్గాల్లో అందరూ చెప్పుకునేదే. సరే మనవడి అక్షరాభ్యాసం సందర్భంగా బాబుగారు పలికిన మరో సుభాషితం పిల్లలను విలువలున్న వ్యక్తులగా తీర్చిదిద్దాలి. ఏమిటా విలువలు. మన తరవాత మన పిల్లలు కూడా అర్హత ఉన్నా లేకున్నారాజకీయాల్లోకే రావాలి అది దొడ్డి దారైనా పర్లేదు.
ఇక అన్నిటికీ మించి దౌర్భాగ్యం ఏమిటంటే.. అసలేమీ లేని దానికి కూడా ఏదో సాధించేశామన్నట్టు చంద్రబాబు చెప్పుకునే గొప్పలను తాటికాయంత అక్షరాలతో తొలి పేజీలలో ముద్రించే మీడియా. అ, ఆ లతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడమేమిటో.. చెప్పే చంద్రబాబుకు రాసే మీడియాకు అయినా తెలుసా? అ అంటే అమ్మ కాబట్టి అమ్మకు వందనం అనే కార్యక్రమం చేపట్టారట.. ఆ అంటే ఆంధ్రప్రదేశ్ అని ప్రజలందరి ఆనందం కోసం పలికిస్తున్నారట.. వీటికి అర్థాలు చెప్పగలిగే వారు ఎవరైనా దొరికితే బాగుండు అని ప్రజలు వెతుకుతున్నారు.