నాగశౌర్య సరసన సాయిపల్లవి

ఫిదా సినిమాతో హీరోయిన్ సాయి పల్లవి తెలుగు ప్రేక్షకుల మతులు పోగొట్టేసింది. నిజానికి ప్రేమమ్ సినిమాకే ఆమెను తీసుకోవాలి అనుకున్నారు. కానీ కాస్త వెనకడుగు వేసారు. ఆమె వుంటే మిగిలిన వారిని డామినేట్ చేసేస్తుందని భయపడ్డట్లు అప్పట్లో అనుకున్నారు. కానీ జనాలు ఎవరే.. ఎవరే (మలరే) పాటకు శృతి హాసన్ ను సాయిపల్లవితో పోల్చుకుని, ఓ రేంజ్ లో సోషల్ నెట్ వర్క్ లో నెగిటివ్ కామెంట్లు విసిరారు. 

ఇప్పుడు మొత్తానికి సాయిపల్లవి తెలుగులోకి వచ్చేసింది. నూటికి రెండు వందల మార్కులు కొట్టేసింది. కమర్షియల్ హీరోయిన్ పాత్రలేమో కానీ, కాస్త మంచి పాత్రలు వుంటే ఆమెను వెదుకుతారు. అది పక్కా. అయితే సాధారణంగా ఓ సినిమా హిట్ అయితే దాని ప్రభావం రెండో సినిమా మీద వుంటుంది.

సాయిపల్లవి తన రెండో సినిమాను హీరో నాగ శౌర్యతో చేస్తోంది. తమిళనాట భారీ సినిమాల సంస్థ లైకా ప్రొడక్షన్స్ నాగశౌర్య హీరోగా, ఎఎల్ విజయ్ డైరక్షన్ లో ఓ సినిమా దాదాపు ఫినిష్ చేసేసింది. ఈ సినిమాలో సాయిపల్లవే హీరోయిన్. సో, ఆ బజ్ ఆ సినిమాకు ఎలాగూ వస్తుంది. అందుకే నాగశౌర్య పిచ్చ హ్యపీగా వున్నాడట.

Show comments