ఢిల్లీనుంచి వెంకయ్య కీ ఇచ్చి పంపిస్తున్నారా?

ఆంధ్రప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీకి ప్రజల శాపనార్ధాలు తప్పించుకోవడానికి ఏం చేయాలనే విషయంలో ఆ పార్టీ పెద్దలు ఇప్పటికే తలలు పట్టుకుంటున్నారనడం అందరికీ తెలిసిన సంగతే. రాష్ట్రంలో ఏ పని జరగకపోయినా... కేంద్రంనుంచి అందాల్సిన సాయం పరంగా తమకు ఎలాంటి సంబంధమూ లేదని చెప్పడానికి.. రాష్ట్ర భాజపా నాయకులు నానా పాట్లు పడుతున్నారు గానీ పెద్దగా ఫలితం ఉండడం లేదు . 

ఇలాంటి నేపథ్యంలో.. భాజపా గురించి టముకు వేయడంతో పాటు, ప్రత్యేకహోదా విషయంలో జరుగుతున్న వంచన దగ్గరినుంచి, కేంద్ర ప్రభుత్వ అంశాలను తీసుకురావడంలో తన వైఫల్యాల గురించి జనం నిత్యం తిట్టిపోయకుండా వెంకయ్యనాయుడు ఏపీ నాయకులకు పాఠాలు చెప్పి పంపిస్తున్నారట. ఏపీలో ఏం మాట్లాడాలి.. ఎలా తమ పార్టీ పరువు కాపాడుకోవాలి? అనేది ఆయన ప్రత్యేకంగా క్లాసు తీసుకుని మరీ.. వారికి అసైన్‌మెంట్లు ఇస్తున్నారట. 

హోదా విషయంలో మోసం ఎవరు చేసినప్పటికీ, చేస్తున్నప్పటికీ నిందలన్నీ వెంకయ్యనాయుడు మీదే పడ్డాయి. ఆరోజున రాజ్యసభలో తానెందుకు పదేళ్ల హోదా కోసం పట్టుపట్టానా? ఇవాళ ఇలా ఇరుక్కుపోయానే? అని ఆయన తనను తాను తిట్టుకునేలాగా పరిస్థితులు విషమిస్తున్నాయి. మోడీని తిట్టడం కంటె ఎక్కువగా జనం వెంకయ్యనాయుడునే తిడుతున్నారు. తాను ఆంధ్రప్రదేశ్‌కోసం చాలా చేసేస్తున్నానంటూ.. ఇక్కడ మాట్లాడిన ప్రతి సందర్భంలోనూ భారీ స్థాయిలో టముకు వేసుకోవడానికి ఆయన తనంతగా చేయని ప్రయత్నం అంటూ లేదు. 

తాజాగా ఢిల్లీలో రెండురోజుల కిందట భాజపా కోర్‌ కమిటీ సమావేశం జరిగింది. ఏపీ నాయకులకు వెంకయ్య ప్రత్యేకంగా కీ ఇచ్చి పంపినట్లుగా తెలుస్తోంది. తరచూ మీడియాలో కనిపిస్తూ.. ప్రత్యేక హోదా అనే దానిలో పెద్ద లాభమేమీ లేదనే వాదనను బాగా ప్రచారం చేయండి. ప్రత్యేకించి వెంకయ్యనాయుడు రాష్ట్రానికి చాలా నిధులు తెస్తున్నారనే ప్రచారాన్ని షురూ చేయండి అంటూ ఆయన వారికి పురమాయించారట. ఢిల్లీనుంచి వచ్చిన దగ్గరినుంచీ వారు అదే పని మీద ఉన్నారు. 

అయినా నాయకులు చెప్పే మాయమాటల్ని ప్రజలు విశ్వాసంలోకి తీసుకునే రోజులు ఎప్పుడో గతించిపోయాయి. వెంకయ్య చెప్పినా, వెంకయ్యను హీరో కింద ప్రొజెక్టు చేస్తూ ఆయన తైనాతీలు డప్పు కొట్టినా.. ఇప్పుడు ప్రజలు నమ్మే స్థితిలో లేరు. కానీ ఈ విషయాన్ని నాయకులు గుర్తించడానికి మాత్రం కొంత సమయం పడుతుందేమో. 

Show comments