తెలుగు సినీ పరిశ్రమలో డ్రగ్స్ ఆరోపణలు ఎదుర్కొంటున్న సెలబ్రిటీలకు సంబంధించి ఇప్పటికే పలువురు మీడియా ముందుకొచ్చారు. ఇంకొందరు, మీడియాకి మొహం చాటేస్తున్నారు. మరికొందరేమో తమ తరఫున తమ కుటుంబ సభ్యుల్ని ప్రత్యక్షంగానో పరోక్షంగానో ముందుకు తీసుకొచ్చి, వారితో తమకు 'క్లీన్' సర్టిఫికెట్ ఇప్పించుకుంటున్నారు.
ప్రముఖ దర్శకుడు పూరిజగన్నాథ్ కుమార్తె పవిత్ర, తన తండ్రిని వెనకేసుకొస్తూ సోషల్ మీడియాలో 'ఘాటుగా' స్పందించిన విషయం విదితమే. 'మా నాన్న మంచోడు, అలాంటి వ్యక్తిపై ఆరోపణలు చేయడం సబబు కాదు. మీ మీద ఆరోపణలు వస్తే, మీ కుటుంబ సభ్యులెలా బాధపడతారో మీకు తెలుసా.?' అంటూ సోషల్ మీడియాలో పవిత్ర చేసిన పోస్టింగ్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది.
తాజాగా, ఇప్పుడు హీరో రవితేజ తల్లి మీడియా ముందుకొచ్చారు. కుమారుడు భరత్ రోడ్డు ప్రమాదంలో మరణించడంపైనా, ఆ మరణం చుట్టూ వివాదాలు రావడంపైనా, ముఖ్యంగా సోదరుడు సహా కుటుంబ సభ్యులెవరూ భరత్ అంత్యక్రియలకు రాలేదంటూ వచ్చిన ఆరోపణలపైనా ఆమె స్పందించారు. అంతే కాదండోయ్, రవితేజపై వచ్చిన డ్రగ్స్ ఆరోపణల్నీ ఖండించేశారామె. రవితేజకు డ్రగ్స్తో సంబంధం లేదన్నారు. కనీసం సిగరెట్ కాల్చే అలవాటు కూడా రవితేజకి లేదని ఆయన తల్లి స్పష్టం చేసేశారు.
రవితేజ సోదరుడు భరత్ గతంలో పలుమార్లు డ్రగ్స్ కేసులో బుక్ అయిన విషయం విదితమే. భరత్తోపాటు, రఘు సైతం ఈ తరహా వివాదాల్లో ఇరుక్కున్నారు. వారి నుంచి రవితేజకీ, తద్వారా పూరిజగన్నాథ్ సహా మరికొందరికి డ్రగ్స్ అలవాటయ్యిందని గత కొద్ది రోజులుగా విన్పిస్తోన్న ఊహాగానాల సారాంశం. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ పలువురికి నోటీసులు పంపిన విషయం విదితమే.