'రోబో 2.0' సినిమాకి సంబంధించి 'లీక్' వ్యవహారం వెలుగు చూసింది. అయితే, ప్రస్తుతానికి పొటోలకే పరిమితమయ్యింది. రజనీకాంత్, అమీ జాక్సన్ కన్పిస్తున్న రెండు ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. శంకర్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా 'రోబో 2.0' సినిమా తెరకెక్కుతోన్న విషయం విదితమే. బాలీవుడ్ నటుడు అక్షయ్కుమార్ ఈ సినిమాలో నెగెటివ్ రోల్లో కన్పించబోతున్నాడు.
శంకర్ సినిమా అంటేనే కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లుంటాయి. షూటింగ్ పరిసరాల్లో ఎక్కడా మొబైల్ ఫోన్ల వినియోగం వుండదు. షూటింగ్ స్పాట్ నుంచి శంకర్కి తెలియకుండా ఎలాంటి సమాచారం బయటకు పొక్కదు. కానీ, ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఎలాగోలా 'లీక్'లు బయటకొస్తుండడం ఇటీవలి కాలంలో సర్వసాధారణమైపోయింది. 'బాహుబలి'కే తప్పలేదు. అయినాసరే, శంకర్ తీసుకునే జాగ్రత్తల నేపథ్యంలో ఇప్పుడీ 'లీక్' వ్యవహారం అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది.
ప్రస్తుతం రజనీకాంత్ అభిమానులు 'కాలా' మేనియాలో మునిగి తేలుతున్నారు. సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకోవడంతో పాటుగా, ఎప్పటికప్పుడు ఆన్ లొకేషన్ స్టిల్స్ బయటకొచ్చేస్తున్నాయి. దాంతో, 'కాలా' మీదకు ఫోకస్ వెళ్ళి, 'రోబో 2.0' మీదకు ఫోకస్ తగ్గింది. దాంతో, కావాలనే 'రోబో 2.0' టీమ్, ఆన్ లొకేషన్ స్టిల్స్ రెండింటిని లీక్ చేసినట్లుగా ఓ వార్త తమిళ సినీ వర్గాల్లో గుప్పుమంటోంది.
మరోపక్క, 'రోబో 2.0' నిర్మాతలు 'రోబో 2.0'కి సంబంధించి ప్రమోషన్ ఏదో ఒక రూపంలో మొదలు పెట్టాలనుకుంటున్నారట. అదే గనుక నిజమైతే, అభిమానులకు అంతకన్నా కావాల్సిందేముంది.?