అప్పుడు ఇచ్చిన మాటను ఇప్పుడు నిలబెట్టుకున్నారు..

అన్నీ అనుకున్నట్టు జరిగితే రామ్ చరణ్, సుకుమార్ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా ఉండాల్సింది. కానీ ఆ స్థానంలోకి సమంత వచ్చి చేరింది. అప్పట్లో ఈ వ్యవహారంపై ఓ చిన్నపాటి ప్రెస్ నోట్ రిలీజ్ చేసిన మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ.. భవిష్యత్తులో తాము చేసే ప్రాజెక్టుల్లో కచ్చితంగా అనుపమకు ఛాన్స్ ఉంటుందని ప్రకటించారు. చెప్పినట్టుగానే ఇప్పుడు ఆమెకు అవకాశమిచ్చారు.

త్వరలోనే నాగచైతన్య హీరోగా, చందు మొండేటి దర్శకత్వంలో ఓ సినిమా నిర్మించబోతున్నారు మైత్రీ మూవీ మేకర్స్. ఈ ప్రాజెక్టులోకి అనుపమ పరమేశ్వరన్ ను హీరోయిన్ గా తీసుకున్నారు. చైతూ-అనుపమ కాంబోలో ఇది సెకెండ్ మూవీ. ఇంతకుముందు నాగచైతన్య నటించిన ప్రేమమ్ సినిమాలో అనుపమ ఉంది.

రామ్ చరణ్, సుకుమార్ సినిమా సెట్స్ పైకి వెళ్లకముందు హీరోయిన్ విషయంలో చాలా హైడ్రామా నడిచిన విషయం తెలిసిందే. సమంత కంటే ముందు ఈ సినిమాలో హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్ పేరు తెరపైకి వచ్చింది. అయితే రెమ్యూనరేషన్ ఎక్కువగా డిమాండ్ చేయడం వల్లనే అనుపమను తప్పించారంటూ వార్తలు వచ్చాయి. వాటిని ఖండిస్తూ ప్రకటన చేసిన మైత్రీ మూవీస్ సంస్థ.. తమ ఫ్యూచర్ ప్రాజెక్టుల్లో ఆమెకు కచ్చితంగా చోటుంటుందని తెలిపింది. అన్నట్టుగానే ఇప్పుడు మాట నిలబెట్టుకుంది.

Show comments