'ఓ సినిమాలో నటించాలా.? వద్దా.? అన్నది ఆయా నటీనటుల ఇష్టం. కొన్నిసార్లు సినిమాలు ఒప్పుకున్నాక తప్పుకోవడం వివాదాస్పదమవుతుంటుంది. ఆ వివాదాల్ని పరిష్కరించడానికి వేరే మార్గాలున్నాయి. సినిమా నుంచి తప్పుకుంటున్నప్పుడు, ఆ సినిమాపై బురద జల్లడం ఏమాత్రం తగదు..' అంటూ 'సంఘమిత్ర' టీమ్, హీరోయిన్ శృతిహాసన్పై అసహనం వ్యక్తం చేసింది.
అత్యంత ప్రతిష్టాత్మకంగా, 200 కోట్ల రూపాయల బడ్జెట్తో, సుందర్ దర్శకత్వంలో 'సంఘమిత్ర' సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమా కోసం శృతిహాసన్ని ఎంపిక చేశారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ కావడంతో, ఈ సినిమా కోసం ముందస్తుగానే శృతిహాసన్ కసరత్తులు ప్రారంభించింది. విదేశాలకు వెళ్ళి కత్తి యుద్ధాల్లో ప్రావీణ్యం సంపాదించుకుంది కూడా. ఏమయ్యిందో, ఎవరూ ఊహించని విధంగా ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది శృతిహాసన్.
ఆమెను చిత్ర దర్శక నిర్మాతలే తొలగించారన్నది ఓ వాదన. కాదు కాదు, తానే ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు శృతిహాసన్ అధికారికంగా ప్రకటించింది. కథ ఇంకా సిద్ధం కాకపోవడం వల్లే తాను ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవాల్సి వచ్చిందంటూ శృతిహాసన్ చెప్పుకొచ్చింది. శృతి ఆరోపణలపై 'సంఘమిత్ర' టీమ్ ఘాటుగా స్పందించింది. అంతా ఓకే అనుకున్నాకే, శృతిహాసన్ ఈ సినిమాలో నటించడానికి ఒప్పుకుందనీ, ఇప్పుడు కథ సరిగ్గా లేదనడం హాస్యాస్పదమని చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చింది.
అంతా బాగానే వుందిగానీ, శృతిహాసన్ పాత్రలో ఎవర్ని ఎంపిక చేయనున్నారు.? ఇదే ఇప్పుడు సస్పెన్స్గా మారింది. అనుష్క, తమన్నా, కాజల్ తదితరుల పేర్లు విన్పిస్తున్నా, 'సంఘమిత్ర' టీమ్ మాత్రం ఈ విషయమై ఇంకా ఎలాంటి స్పష్టతా ఇవ్వలేదు.