కలెక్షన్లు చెప్పడానికి భయపడుతున్న నాగార్జున

ఎంత చెట్టుకు అంత గాలి. ఎవరి మార్కెట్ వాల్యూకు తగ్గట్టు వాళ్ల సినిమాలకు వసూళ్లు వస్తుంటాయి. నాగచైతన్యకు కూడా అలానే వచ్చాయి. ఇంకా చెప్పాలంటే చైతూ కెరీర్ లోనే అత్యధిక వసూళ్లు వచ్చాయి. కానీ వాటిని బయటపెట్టడానికి భయపడుతున్నాడు నాగ్.

నాగచైతన్యను హీరోగా పెట్టి రారండోయ్ వేడుక చూద్దాం సినిమా నిర్మించాడు నాగార్జున. రేపటితో 50రోజులు పూర్తిచేసుకోబోతోంది ఈ సినిమా. ఈ సందర్భంగా సినిమా సాధించిన వసూళ్లతో ఓ పెద్ద పోస్టర్ విడుదల చేయాలనేది నాగ్ ఆలోచన. కానీ ఈ ఆలోచనకు డీజే అడ్డంకిగా మారింది.


డీజే వసూళ్లపై జరుగుతున్న రచ్చ అందరికీ తెలిసిందే. ఏకంగా బాహుబలి-2 తర్వాత డీజే అని చెప్పేశారు. వారం రోజుల్లో వంద కోట్లు అని ప్రకటించేశారు. దీంతో మెగాస్టార్ సినిమాతో పాటు చాలా హీరోల సినిమాలు వెనక్కి వెళ్లిపోయాయని పరోక్షంగా చెప్పుకొచ్చారు. ఇలాంటి టైమ్ లో నాగచైతన్య సినిమా కలెక్షన్లు బయటపెడితే అదెలాంటి వివాదాలకు దారితీస్తుందోనని నాగ్ భయం.

రారండోయ్ సినిమాకు 50రోజుల్లో దాదాపు 30కోట్ల రూపాయల షేర్ వచ్చే అవకాశముందని అంచనా వేస్తున్నారు. డీజే వసూళ్లు పక్కన ఈ అంకెలు చూపిస్తే చాలా చిన్నగా కనిపించవచ్చు.

ఎందుకంటే డీజేకు ఒక్క నైజాంలోనే 20కోట్లు వచ్చాయని ప్రకటించేశారు మరి. సో.. ఎలా చూసుకున్నా రారండోయ్ లెక్కలు రిలీజ్ చేస్తే మరోసారి కలెక్షన్లపై చర్చ ప్రారంభమౌతుందని నాగ్ భయపడుతున్నాడు. అలా అని చెప్పకుండా ఉంటే చైతూ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అనే విషయాన్ని ప్రకటించడం కుదరదు.

Show comments