భూమా నాగిరెడ్డిని ఓడించడమే లక్ష్యం!

భూమా నాగిరెడ్డి కి మంత్రి పదవి ఇస్తే సహించే ప్రసక్తి లేదని శిల్పా బ్రదర్స్ అంటున్నారు.  ఈ మేరకు వారు తమ అనుచరులతో సమావేశాల్లో వ్యాఖ్యానిస్తున్నారు. మంత్రి వర్గ విస్తరణ.. నాగిరెడ్డికి మంత్రి పదవి.. అనే ఊహాగానాల నేపథ్యంలో శిల్పా బ్రదర్స్ స్పందన ఆసక్తికరంగా ఉంది. భూమా నాగిరెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ తరపున పోటీ చేసి గెలిచాడని, అలాంటి వ్యక్తికి తెలుగుదేశం ప్రభుత్వంలో ఎలా మంత్రి పదవిని ఇస్తారు? అని శిల్పా బ్రోస్ ప్రశ్నిస్తున్నారు!

ప్రతిపక్ష పార్టీ వైపు నుంచి వినిపించాల్సిన ఈ ప్రశ్న టీడీపీ నేతల నుంచినే ఈ విధంగా వినిపిస్తోంది. ఒకవైపు తెలంగాణలో తలసానిని తిడుతున్న టీడీపీ.. భూమాకు పదవిని ఇవ్వకూడదని వీరు అంటున్నారు. అంతగా ఇవ్వాలంటే.. భూమా చేత ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయించాలని కూడా శిల్పా సోదరులు డిమాండ్ చేస్తున్నారు.

ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. ఒకవేళ భూమా అలా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి పోటీ చేస్తే.. ఆయనను ఓడించడానికి తామే రంగంలోకి దిగుతామని శిల్పా సోదరులు చెబుతుండటం. భూమాను ఓడించడమే తమ లక్ష్యం అని..తెలుగుదేశం తరపున తమకు అవకాశం దొరకకపోతే.. ఇండిపెండెంట్ గా పోటీ చేసి అయినా, భూమాను ఓడిస్తామని వీరు సవాలు విసురుతున్నారు!

ఇప్పటికే పలు దఫాలుగా నంద్యాల నియోజకవర్గంలోని వీరి మధ్య బాబు రాజీ చేసినా.. సవాళ్లు, ప్రతిసవాళ్లూ కొనసాగుతున్నాయి! ఒక వర్గాన్ని మరో వర్గం హెచ్చరించుకుంటూనే ఉంది. 

Show comments