ఆగిపోయిన సినిమాకు రిలీజ్ డేట్ ఫిక్స్

ఆ సినిమా ప్రారంభమై సరిగ్గా మూడేళ్లయింది. ఇంకా షూటింగ్ స్టేజ్ లోనే ఉంది. ఇప్పటికి 3 రిలీజ్ డేట్స్ మార్చారు. తాజాగా ఇంకో డేట్ ఫిక్స్ చేశారు. అదే జగ్గా జాసూస్. రణబీర్ కపూర్, కత్రినాకైఫ్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు ఎట్టకేలకు మోక్షం లభించనుంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే జులై 14న జగ్గా జాసూస్ థియేటర్లలోకి వస్తుంది.

వాస్తవానికి రిలీజ్ డేట్స్ విషయంలో బాలీవుడ్ లో క్లాష్ ఉండదు. హీరోలంతా ముందుగానే డేట్స్ లాక్ చేసుకుంటారు. సల్మాన్, షారూక్ లాంటి హీరోల సినిమాల రిలీజ్ డేట్స్ అయితే ఏడాది ముందే ఫిక్స్ అయిపోతాయి. కానీ జగ్గా జాసూస్ మాత్రం ఏడాదికో రిలీజ్ డేట్ తో సాగుతూనే ఉంది. ఈ ఏడాది జులైకి కూడా ఇది వచ్చేది అనుమానమే అంటున్నారు బాలీ క్రిటిక్స్.

అనురాగ్ బసు ఈ సినిమాకు దర్శకుడు. కేవలం దర్శకత్వం వహించడంతో పాటు రణబీర్ కపూర్ తో కలిసి ఈ సినిమాను జాయింట్ గా నిర్మిస్తున్నాడు కూడా. సరిగ్గా ఇక్కడ చిక్కులొచ్చిపడ్డాయి. వీటికి తోడు రణబీర్-కత్రిన మధ్య సంబంధాలు దెబ్బతినడం కూడా "జగ్గా జాసూస్" కు శాపంగా మారింది. తాజా రిలీజ్ డేట్ ను స్వయంగా రణబీర్ కపూర్ ప్రకటించడంతో ఈసారి ఆడియన్స్ కు కాస్త గురి కుదిరింది. అయితే షూటింగ్ మాత్రం ఇంకా బ్యాలెన్స్ ఉంది.

Show comments