మలయాళంలోకి డీజే.. బాహుబలి-2ను దాటేస్తారేమో!

బన్నీ నటించిన దువ్వాడ జగన్నాథమ్ సినిమా టాలీవుడ్ లో చిన్నపాటి దుమారం రేపిన విషయం తెలిసిందే. ఈ సినిమా వసూళ్లను ఎక్కువ చేసి చెప్పారంటూ దర్శకుడు హరీష్ శంకర్, నిర్మాత దిల్ రాజుపై సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో దుమ్మెత్తిపోశారు జనాలు. అయినప్పటికీ డీజే యూనిట్ మాత్రం తాము చేయాల్సింది చేసుకుంటూ పోయింది. 

టాలీవుడ్ లో డీజే రన్ ఎప్పుడో కంప్లీట్ అయింది. ఫైనల్ రన్ లో ఆ మూవీ ఎంత కలెక్ట్ చేసిందనే విషయాన్ని మాత్రం మేకర్స్ చెప్పలేదు. ఈ నేపథ్యంలో డీజే సినిమా మలయాళంలో విడుదలకు సిద్ధమైంది. కేరళలో బన్నీకి కాస్త ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అందుకే డీజే సినిమాను అక్కడ భారీస్థాయిలో విడుదల చేస్తున్నారు. ఇప్పటికే కలెక్షన్లను తారుమారు చేసి విమర్శలకు గురైన యూనిట్.. కనీసం మలయాళం వసూళ్లనైనా సరిగ్గా చెబుతుందో లేదో చూడాలి.

బాహుబలి-2 సినిమా మలయాళంలో బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. కేరళలో ఇప్పటికీ కొన్ని థియేటర్లలో సినిమా ఆడుతోందంటే అది ఏ రేంజ్ హిట్టో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు డీజే సినిమా వస్తోంది. బాహుబలి-2 తర్వాత తమ సినిమానే అత్యధిక వసూళ్లు సాధించిందని ఇప్పటికే చెప్పుకున్న యూనిట్.. కేరళలో డీజే సినిమా బాహుబలి-2ను క్రాస్ చేసిందని చెప్పినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఆగస్ట్ 11న డీజే మలయాళం వెర్షన్ విడుదలకానుంది.

Show comments