దక్షిణ భారత దేశంలో ఎన్నో ఏళ్ళ నుండి ఆడియో రంగం లో ఉన్న సంస్థ లహరి. తెలుగు చలనచిత్ర చరిత్రలో చిరస్ధాయిగా నిలిచేలా మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం ఖైదీ నెం 150, నందమూరి నట సింహం బాలకృష్ణ 100వ చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి 2 చిత్రాలు రూపొందుతున్నాయి. ఈ మూడు చిత్రాలు వచ్చే సంవత్సరం ప్రధమార్ధంలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాయి.
ఈ మూడు చిత్రాల ఆడియోల పై అటు అభిమానుల్లోను, ఇటు ఇండస్ట్రీలోను భారీ అంచనాలు ఉన్నాయి. దీంతో ఆడియో రైట్స్ విషయంలో భారీ పోటీ ఏర్పడింది. ప్రముఖ ఆడియో సంస్థ లహరి మ్యూజిక్ ఈ మూడు భారీ చిత్రాల ఆడియో రైట్స్ దక్కించుకోవడం విశేషం. ఈ సందర్భంగా లహరి మ్యూజిక్ అధినేత జి.మనోహర్ నాయుడు మాట్లాడుతూ...., చిరంజీవి కెరీర్ లోను ప్రతిష్టాత్మకమైన చిరంజీవి గారి 150వ చిత్రం ఖైదీ నెం 150 చిత్రం ఆడియో రైట్స్ ను కూడా లహరి మ్యూజిక్ ద్వారా రిలీజ్ చేస్తుండడం చాలా సంతోషంగా వుందన్నారు.
అలాగే బాలకృష్ణ గారి కెరీర్ లో ప్రతిష్టాత్మక చిత్రమైన గౌతమీపుత్ర శాతకర్ణి చిత్రం ఆడియోను కూడా తమ సంస్థ ద్వారానే రిలీజ్ చేస్తుండడం చాలా సంతోషంగా ఉందన్నారు . అదే విధంగా తెలుగు సినిమా చరిత్ర లో ఇప్పటి వరకు ఏ చిత్రానికి ఇవ్వని ఫాన్సీ రేట్ తో బాహుబలి 2 ఆడియో రైట్స్ ను తమ సంస్థ దక్కించుకుందన్నారు. ఈ మూడు ప్రతిష్టాత్మక చిత్రాల ఆడియోలు మా లహరి సంస్థ దక్కించుకోవడం గర్వంగా వుందని అయన అన్నారు.