అత్యంత నాటకీయ పరిణామాల మధ్య నిష్క్రమించిన అమ్మ... తర్వాత తమిళనాట రాజకీయాలు అమ్మ అనారోగ్యం ఎపిసోడ్ అంత గుంభనంగానే సాగిపోతున్నాయా? ఈ ప్రశ్నకు తమిళ రాజకీయాలను పరిశీలిస్తున్న విశ్లేషకులు నుంచి ఔననే సమాధానమే వస్తోంది.
తన వారసుడిగా పన్నీర్ సెల్వంను అమ్మ గతంలోనే ప్రకటించడంతో ఆమె మరణానంతరం... ఆయన్ను తప్ప మరో నేత పేరును సిఎం పదవికి పరిశీలించే పరిస్థితి కూడా లేదు. ఈ నేపధ్యంలోనే తప్పనిసరి తద్దినంలా తలకెక్కించుకున్న పన్నీర్ సెల్వంను పక్కకి తప్పించే తతంగం సైతం అప్పుడే మొదలైపోయిందా? అనే ప్రశ్నకు కూడా అవుననేదే సమాధానం.
కొందరి విశ్లేషణ ప్రకారం.... ప్రస్తుత తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంకు త్వరలోనే ఉద్వాసన పలకాలనేది ఆల్రెడీ నిర్ణయమైపోయింది. ఆ స్థానంలో అన్ని విధాలా తమకు నమ్మకస్తురాలైన వ్యక్తికి పగ్గాలు అప్పగించాలనే ఆలోచన కూడా ఢిల్లీ పెద్దలకు ఉండడంతో దీని వెనుక మంత్రాంగం అంతా కేంద్ర ప్రభుత్వ కనుసన్నల్లో నడుస్తున్నట్టు తెలుస్తోంది.
తమిళనాడు రాజకీయాలపై అదుపు కోసం అందులో భాగంగానే జయలలితకు, అదే విధంగా పన్నీర్సెల్వంకు అనుంగు అనుచరుడైన శేఖర్రెడ్డిపై దాడులు సైతం జరిగాయి.. తద్వారా పన్నీర్సెల్వంను దెబ్బతీసినట్టు అవుతుందని, అంతేకాకుండా కొత్త సిఎంను సాగనంపేందుకు వీలవుతుందని పై స్థాయిలో భావిస్తున్నట్టు తెలుస్తోంది. అనుకున్నది అనుకున్నట్టు జరిగితే తమ కనుసన్నల్లో ఉండే శశికళను ముఖ్యమంత్రిగా చేయాలనే ఆలోచన సైతం చేస్తున్నట్టు సమాచారం. అందుకు తగ్గట్టుగానే ఒకటొకటిగా పావులు కదుపుతున్నట్టు స్పష్టమవుతోంది.