నాగశౌర్య ఎక్కడ?

జ్యో అచ్యుతానంద సినిమా పాజిటివ్ రివ్యూలతో ఫరావాలేదు అనే దిశగా నడుస్తోంది. నిజానికి ఈ సినిమాకు మరింత బాగా పబ్లిసిటీ చేసి వుంటే ఇంకా బాగుండేది అన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. సినిమా విడుదలకు ముందు, తరువాత కూడా దర్శకుడు అవసరాల శ్రీనివాస్ నే ప్రచార భారాన్ని ఎక్కువగా మోసారు, మోస్తున్నారు.  కొన్ని చానెళ్లకు ఆయనకు తోడుగా సంగీత దర్శకుడు కళ్యాణ్ మాలిక్ కూడా వెళ్లారు.  

అమెరికాలో ఇది తన హిట్ సినిమా అని నారా రోహిత్ చెప్పుకునే ప్రయత్నం చేసారు.కొన్ని థియేటర్లను విజిట్ చేసారు. సో. కొంతవరకు అక్కడ ఫరవాలేదు. సినిమా విడుదలయిన కొన్నాళ్లు హీరోయిన్ రెజీనా రంగంలోకి వచ్చింది. కాస్త ప్రచారం నిర్వహించింది.

కానీ సినిమా విడుదలకు ముందు కోద్ది సేపు మాత్రం కనిపించిన హీరో నాగశౌర్య, సినిమా విడుదలయ్యాక మరి కనిపించలేదు. మీడియమ్ రేంజ్ లో వెళ్తున్న సినిమాను యూనిట్ అంతా కలిసి, కాస్త ప్రమోట్ చేసుకుంటే మరింత బాగుంటుంది. కానీ నాగశౌర్య ఎందుకు మాయమయినట్లో? ప్రస్తుతం షూటింగ్ లు కూడా లేవు. 

గతంలో ఊహలు గుసగుసలాడే సినిమా విడుదలయ్యాక కూడా నాగశౌర్య తనకు ఆరోగ్యం బాగాలేదని, ప్రచారానికి గాయబ్ అయ్యాడు. అప్పట్లో నిర్మాత సాయి కొర్రపాటికి ఈ విషయమై కాస్త ఆగ్రహం కలిగి చాన్నాళ్లు దూరం పెట్టారు కూడా. మరి ఇప్పుడు కూడా నాగశౌర్య అదే కారణం చెబుతున్నట్లు తెలుస్తోంది. సాయి బ్యానర్ లోనే నాగశౌర్య మరో సినిమా కూడా కమిట్ అయి వున్నాడు. మరి అలా కమిట్ అయి వుండి కూడా, ఇలా ప్రచారానికి డుమ్మా కొట్టడం ఏమిటో?

ఇదిలా వుంటే, అమెరికా నుంచి తిరిగి వచ్చిన నారా రోహిత్ కూడా ప్రచారానికి దిగలేదు. సాయి కొర్రపాటి అతి మంచితనం ఇలా సినిమా ప్రచారాన్ని నీరు కారుస్తోందేమో?

Show comments