ఉగాది ముహూర్తానికి మంత్రివర్గ విస్తరణ అని అనే మాట రాయలసీమ రాజకీయాలను హీటెక్కిస్తోంది. గత ఏడాది ఉగాదితో ఒకరకమైన రాజకీయం మొదలైతే, ఈ ఏడాది ఉగాది నుంచి మరో రకమైన రాజకీయం రసవత్తరంగా మారే అవకాశం కనిపిస్తోంది. గత ఏడాది ఉగాది సమయంలో ఫిరాయింపు రాజకీయాలు పతాక స్థాయికి చేరాయి. ఆ సమయంలో రాయలసీమ ప్రాంతానికి చెందిన వైకాపా ఎమ్మెల్యేల ఫిరాయింపు సర్వత్రా చర్చనీయాంశంగా ఉండేది. భూమా నాగిరెడ్డి ఫ్యామిలీ, చాంద్భాషా తదితరుల ఫిరాయింపులు జరిగాయి. ఈ ఫిరాయింపుల ద్వారా వైకాపాను జీరో చేసేశాం.. అని తెలుగుదేశం ప్రకటించేసుకుంది.
మరి అక్కడి వరకూ బాగానే ఉంది కానీ, అక్కడ నుంచి అసలైన రచ్చ మొదలైంది. ఫిరాయించిన వారు.. పదవుల కోసం రచ్చ మొదలుపెట్టారు. రాయలసీమకు చెందిన ఫిరాయింపు ఎమ్మెల్యేల్లో చాలా మందికే మంత్రిపదవి హామీని ఇచ్చాడు చంద్రబాబు నాయుడు. భూమా నాగిరెడ్డితో మొదలు.. చాంద్భాషా వరకూ ఈ హామీలను పొందిన వాళ్లే! అయితే వీళ్లు ఈ హామీని పొంది ఏడాది గడుస్తోంది!
ఈసారి ఉగాదికి కచ్చితంగా విస్తరణ జరిగితే.. సీమ రాజకీయం కొత్తమలుపు తిరిగే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఫిరాయింపు రాజకీయ నేతలకు పదవి ఇస్తే ఒక రచ్చ, ఇవ్వకపోతే మరో రచ్చ.. ఇదీ రాయలసీమ రాజకీయ ద శ్యం! పదవి ఇస్తే బాబు రెండు రకాలుగా ప్రమాదంలోకి పడే అవకాశం ఉంది.
ఒకటో ప్రమాదం నైతికమైనది. ఒకవైపు తెలంగాణలో తలసానికి మంత్రిపదవి ఇవ్వడాన్ని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా దుయ్యబట్టింది. ఆ విషయంలో గవర్నర్ పాత్రను కూడా తీవ్రంగా విమర్శించింది తెలుగుదేశం. ఈ విషయంలో నారాలోకేష్ వంటి వాళ్లు తిట్టు కూడా తిట్టారు! తలసానిని, తెరాస వాళ్లను ఈ విషయంలో అనరాని మాటలు కూడా అన్నారు. ఫిరాయించిన ఎమ్మెల్యేలకు పదవిని ఇవ్వడం అనైతికమంటూ విరుచుకుపడిన తెలుగుదేశం పార్టీ అదే పనిని ఏపీలో చేసినట్టు అవుతుంది. అదే చేస్తే.. చంద్రబాబు చులకన అవుతాడు.
అయితే రెండు కళ్ల సిద్ధాంతం తెలుగుదేశానికి ఏమీ కొత్తకాదు కాబట్టి.. నైతిక విలువలకు తిలోదకాలు ఇవ్వడం పెద్దకష్టం ఏమీకాదు కాబట్టి.. భూమాకు కానీ, చాంద్భాషాకు కానీ పదవి దక్కే అవకాశం ఉంది. అయితే.. అదే జరిగితే, మరోరకంగా రాజకీయం రసవత్తరంగా మారే అవకాశం ఉంది. భూమాకు పదవిని ఇస్తే తాము పార్టీని వీడతామని శిల్పావర్గం స్పష్టం చేసింది ఇప్పటికే. భూమాతో ఆది నుంచి అమితుమి తలపడుతూ వస్తున్న శిల్పా వర్గం ఇప్పుడు అల్టిమేటం ఇవ్వడంలో పెద్ద ఆశ్చర్యం లేదు! భూమాకు పదవిని ఇస్తే వాళ్లు తక్షణం తెలుగుదేశానికి రాజీనామా చేసి వైకాపాలో చేరే అవకాశాలున్నాయి. అది వారికి ఏమాత్రం కష్టంకాదు!
ఇక భూమాకు మంత్రి పదవిని ఇవ్వకపోవడం.. ఈ కోణం నుంచి చూస్తే చంద్రబాబు కొంత వరకూ సేఫే! కానీ.. ఇరవై మంది ఎమ్మెల్యేలు ఫిరాయిస్తే వారిలో చాలా మందికి మంత్రి పదవి హామీలు ఇచ్చారు. ఎవ్వరికీ పదవిని ఇవ్వకుండా బండిలాగించడం కష్టం. అలాగని ఏ ఉత్తరాంధ్రలోని వారిని కేబినెట్లోకి తీసుకుని, భూమాను తీసుకోకపోతే.. అప్పుడు వీళ్లు కస్సుమంటారు! అయితే అలాంటి కస్సుబుస్సులను బాబు లెక్కచేయకపోవచ్చు. కానీ.. మరోసారి హామీని పొంది మోసపోవడం భూమా కుటుంబానికి అనుభవంలోకి వస్తుందంతే!
ఇక ఫిరాయింపు రాజకీయాల సంగతిలా ఉంటే.. పాతకాపుల రచ్చ ఉండనే ఉంది. ఇప్పటికే పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు మూడేళ్లు కావొస్తోంది. ఇంక రెండేళ్లలో ఈ పాటికి ఎన్నికల నోటిఫికేషన్ విడదల అయిపోతుంది. దీంతో.. చాలా మందికి మంత్రి పదవుల ప్రయత్నాలకు ఇదే తుదిగడువు అవుతోంది. ఇప్పుడు దక్కితే ఫర్వాలేదు లేకపోతే.. ఇక దక్కదు అనే స్థితి ఉంది. దీంతో అందరూ ఒక్కసారిగా అలర్ట్ అవుతున్నారు!
తెలుగుదేశంలోని పాతకాపుల్లో మంత్రి పదవుల మీద ఆశలు పెట్టుకున్న వారి జాబితాను పరిశీలిస్తే అది చాలా పెద్దదే అవుతుంది! అనంత నుంచి పయ్యావుల కేశవ్, బాలక ష్ణ, పార్థసారథి వంటి వాళ్లు ఆశలు పెట్టుకున్నారు. ఇక కర్నూలులో ఫిరాయింపుల రచ్చ ఉంది. చిత్తూరులో పాతకాపులు, కొత్తగా వచ్చిన వారు.. ఆశావహుల జాబితాలో ఉన్నారు. కడపలో సతీష్రెడ్డి వంటి వాళ్లు తమ ప్రయత్నాల్లో తామున్నారు. అయితే.. బాబు తీరు చూస్తుంటే.. సీమలో ఎవరికీ కొత్తగా అవకాశాలు దక్కేలా కనిపించడం లేదు!
ఉన్నవారినే తొలగించే అవకాశాలున్నాయి. పల్లె, బొజ్జల ఇద్దరినీ కేబినెట్ నుంచి తప్పిస్తారనే మాట వినిపిస్తోంది. వీరిని అసమర్థుల కోటాలో తొలగించవచ్చట. మరి బాబు భజన చేయడంలో పల్లె రఘునాథరెడ్డి అంత సమర్థతను కనబరుస్తున్నా.. ఆయనను అసమర్థుడు అనడం విడ్డూరమే! పల్లె, బొజ్జలను ఇద్దరినీ కేబినెట్ నుంచి తొలగించినా.. అడిగే వారు ఎవరూ లేరు. కాబట్టి.. ఆ విధంగా ముందుకు పోవచ్చు. కొత్తగా రాయలసీమ రెడ్డి వర్గానికి ప్రాతినిధ్యం దక్కకపోయినా.. ఉన్న వారిని తొలగించడం మాత్రం దాదాపు ఖాయంగానే కనిపిస్తోంది. ఇక మరో మంత్రి పరిటాల సునీత మాత్రం కులం కోటాలో పదవిని నిలుపుకోవచ్చనే మాట వినిపిస్తోంది. మంత్రిగా సునీత సాధించిన అద్భుతాలు ఏమీ లేకపోయినా.. పైపెచ్చూ పక్క నియోజకవర్గాల వ్యవహారాల్లో వేలు పెడుతూ నష్టం చేస్తున్నా.. ఆమెను కులం రక్షిస్తుందనే విశ్లేషణ వినిపిస్తోంది. అయితే స్వకులస్తుడు పయ్యావుల నుంచి మాత్రం ఆమెకు పోటీ ఉంది. ఇక మరో పోటీదారు బాలక ష్ణకు మాత్రం అవకాశాలు మ గ్యం అయినట్టే!
మంత్రిపదవి మీద చాలా ఆశలనే పెట్టుకుని ఉన్న బాలయ్యను వ్యూహాత్మకంగా దెబ్బతీశారు చంద్రబాబు. బాలయ్య పీఏపై తెలుగుదేశం ఎమ్మెల్యేల రచ్చ వెనుక కర్త, కర్మ, క్రియ చంద్రబాబే అని విశ్లేషకులు అంటున్నారు. మంత్రివర్గ విస్తరణ నేపథ్యంలో బాబుపై బాలయ్య ఒత్తిడి పెంచుతున్న క్రమంలో దాన్నుంచి విముక్తి పొందడానికి పీఏ రగడను రైజ్ చేసి, బాలయ్యను కట్టడి చేయడంలో బాబు విజయవంతం అయ్యాడని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీంతో మంత్రిపదవి విషయంలో బాలయ్య ఆశలకు పూర్తిగా గండి పడిందంటున్నారు!
ఏతా వాతా.. మంత్రివర్గ విస్తరణ నేపథ్యంలో సీమ నుంచి ఉన్న వాళ్ల పదవులు పోవడమే తప్ప.. కొత్తగా చేర్పులు జరిగే అవకాశాలు కనిపించడం లేదు!