మెగా కుర్రాడు మంచి స్పీడుమీదున్నాడు.!

మెగాస్టార్‌ చిరంజీవి మేనల్లుడిగా మెగా కాంపౌండ్‌ నుంచి వచ్చిన యంగ్‌ హీరో సాయిధరమ్‌తేజకి తొలి సినిమా 'రేయ్‌' కాస్త ఇబ్బంది పెట్టినా, ఆ తర్వాత మాత్రం స్పీడ్‌ పెంచేశాడు. 'రేయ్‌' ఆలస్యంగా విడుదలైతే, అంతకన్నా ముందు రెండో సినిమా 'పిల్లా నువ్వు లేని జీవితం' విడుదలయ్యింది. 'జస్ట్‌' ఓకే అనిపించుకున్నాడు ఆ సినిమాతో సాయిధరమ్‌తేజ. ఆ తర్వాత 'సుబ్రహ్మణ్యం ఫర్‌ సేల్‌' కాస్తా ఫర్వాలేదన్పించుకుంది. 'సుప్రీం' మాత్రం అనూహ్య విజయాన్ని దక్కించుకుంది. 

ఇక, ఈ జోరు కొనసాగిస్తూ 'తిక్క' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సమాయత్తమవుతున్న సాయిధరమ్‌తేజ, ఓ పక్క హీరోగా సినిమాలు చేస్తూనే, ఇంకోపక్క మల్టీస్టారర్స్‌ (అప్పుడే అనేయొచ్చా.?) సినిమాలకీ 'సై' అనేస్తున్నాడు. కళ్యాణ్‌రామ్‌, సాయిధరమ్‌ కాంబినేషన్‌లో 'యజజ్ఞం', 'పిల్లా నువ్వులేని జీవితం' చిత్రాల ఫేం రవికుమార్‌ చౌదరి దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనున్న విషయం విదితమే. తాజాగా, 'నక్షత్రం' సినిమాలో అతిథి పాత్రలో నటించేందుకు సాయిధరమ్‌ తేజ ఓకే చెప్పాడట. 

కృష్ణవంశీ, చిరంజీవికి అత్యంత సన్నిహితుడు. ఆ పరిచయంతోనే కృష్ణవంశీ అడగ్గానే 'నక్షత్రం'లో నటించేందుకు ఓకే అనేశాడట సాయిధరమ్‌. ఈ సినిమాలో సందీప్‌ కిషన్‌ హీరోగా నటిస్తున్నాడు. పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌ గెటప్‌లో సాయిధరమ్‌కి ఈ సినిమాలో ఛాన్సిచ్చాడు కృష్ణవంశీ. ఇవి కాకుండా, గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో సాయిధరమ్‌ హీరోగా నటించే సినిమా ఇంకా సెట్స్‌పైకి వెళ్ళాల్సి వుంది. హరీష్‌ శంకర్‌ డైరెక్షన్‌లో కూడా ఓ సినిమా చేయనున్నాడు సాయిధరమ్‌. వీరిద్దరి కాంబినేషన్‌లో గతంలో 'సుబ్రహ్మణ్యం ఫర్‌ సేల్‌' సినిమా వచ్చింది. ఆ సినిమా టైమ్‌లోనే రెండో సినిమా వీరిద్దరి కాంబినేషన్‌లో దిల్‌ రాజు నిర్మాతగా ఖాయమయ్యింది. మొత్తమ్మీద, మెగా కుర్రాడు మంచి స్పీడుమీదున్నట్లే కదా.!

Show comments