చిరంజీవి, పవన్కళ్యాణ్ కలిసి ఓ సినిమాలో నటిస్తే.. అదీ ఒకరి సినిమాలో ఇంకొకరు గెస్ట్ రోల్లో కాకుండా, అదొక మల్టీ స్టారర్ అయితే.! అది మల్టీస్టారర్ సినిమాల్లోనే 'మెగాపవర్' మూవీ అవుతుందన్నది నిర్వివాదాంశం. ఇక, ఈ మెగాపవర్ కాంబినేషన్కి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకుడైతే ఇంకెలా వుంటుంది.? ఏంటీ, ఇదంతా నిజమేనా.. అని అంతా ఆశ్చర్యపోవచ్చు. కానీ, ఇది నిజం. ఇదిప్పుడు అధికారికం.
చాలాకాలంగా చిత్ర నిర్మాణానికి దూరంగా వుంటోన్న ఒకప్పటి ప్రముఖ నిర్మాత సుబ్బిరామిరెడ్డి, చాలాకాలం తర్వాత మళ్ళీ సినిమా నిర్మాణం వైపు అడుగులేస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్తో ఇటీవల 'మెగా మల్టీస్టారర్'పై మంతనాలు జరిపారు. తాజాగా, మరోమారు త్రివిక్రమ్తో చర్చలు జరిపిన అనంతరం సుబ్బిరామిరెడ్డి, చిరంజీవి - పవన్కళ్యాణ్తో మల్టీస్టారర్ నిర్మిస్తున్నానంటూ ప్రకటించారు.
నిజానికి, సుబ్బిరామిరెడ్డి 'ఖైదీ నెంబర్ 150' సినిమా విడుదలకు ముందే చిరంజీవి - పవన్కళ్యాణ్ కాంబినేషన్లో సినిమా అనుకున్నారు. అదిప్పుడు నిజమయ్యింది. మొత్తంగా మెగా ఫ్యామిలీ హీరోలందరితోనూ మల్టీస్టారర్ రూపొందిస్తానని అప్పట్లో చెప్పిన సుబ్బిరామిరెడ్డి ప్రస్తుతానికి చిరంజీవి - పవన్కళ్యాణ్ల మల్టీస్టారర్గా ప్రకటించడం గమనార్హం. ఈ మల్టీస్టారర్లో మిగతా మెగా హీరోలు అతిథి పాత్రల్లో అయినా కన్పించే ఛాన్సుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.