వైసీపీ.. ఘాటుగా, సరదాగా, స్పైసీగా!

‘నేనే… నేనే.. నేనే..’ అని చెప్పుకోవడం అలవాటగా మార్చుకున్న ఏపీ సీఎం చంద్రబాబులో ఈ మధ్య కొంత మార్పు కనిపిస్తోంది. ఆ మార్పు ఏమనగా.. ‘నన్ను తలుచుకోండి.. నన్ను గుండెల్లో పెట్టుకోండి.. నా కోసం చప్పట్లు కొట్టండి.. నా కోసం ప్రార్థించండి..’ అని తరచూ అంటున్నారు చంద్రన్న! నేను మిమ్మల్ని ఒక రేంజ్ లో ఉద్ధరించేశాను… కాబట్టి నన్ను మీరు తలుచుకొంటూ పడుకోవాలి. నన్నే స్మరించుకోవాలి అన్నట్టుగా సాగుతున్నాయి బాబు ప్రసంగాలు!

నేనే.. అనే దగ్గర నుంచి నన్నే.. అనే దగ్గకు వచ్చారు చంద్రన్న. ఒకసారని కాదు.. ఈ మధ్య ప్రతి బహిరంగ సభలోనూ బాబు తీరు ఇదే విధంగా ఉంది. ఈ నేపథ్యంలో బాబు తీరుపై ఘాటుగా, సరదాగా స్పందించింది ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీ నేత భూమన మాట్లాడుతూ.. ‘చంద్రబాబు తన కాళ్లకు తనే మొక్కుకుంటున్నాడు..’ అని వ్యాఖ్యానించి ప్రెస్ మీట్ లో నవ్వులు పండించారు!

గట్టిగా చప్పట్లు పెట్టండి.. నన్నే స్మరించుకోండి.. నన్నే తలుచుకోండి.. అంటూ చంద్రబాబు ప్రజల ముందు చెప్పుకొంటున్నారని, ఇలా తనకు తానే డబ్బా కొట్టుకోవడంలో కొత్తరకంగా ముందుకు వెళ్తూ చంద్రబాబు తన పాదాలకు తనే నమస్కరించుకునేంత ధీన స్థితికి వచ్చాడని భూమన అన్నారు. రొటీన్ విమర్శలు కాకుండా.. సరదాగా ఉన్నాయి భూమన చతుర్లు. 

జేసీపై కూడా పరోక్షంగా విరుచుకుపడ్డాడు భూమన. జేసీని ‘తోలుబొమ్మ తైతక్కల తిక్కల రెడ్డి’ అని అభివర్ణించాడు. జగన్ అంటే భయం పట్టుకుని వీళ్లు కవి చౌడప్పను మించి బూతులను మాట్లాడుతున్నారని భూమన విరుచుకుపడ్డాడు.

Show comments