పాక్‌పై ఎటాక్‌.. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు.?

పాపాల పాకిస్తాన్‌ ఇంకా తన దుశ్చర్యల్ని మానుకోవడంలేదు.. పాపిస్తాన్‌ కదా, పాపాలే దానికి అలవాటు మరి.! సర్జికల్‌ స్ట్రైక్స్‌తో బుద్ది చెప్పాలనుకున్నాంగానీ.. పాకిస్తాన్‌కి మాత్రం బుద్ధి రాలేదు. పాపిస్తాన్‌ యుద్ధమే కోరుకుంటోంది.. ఇక్కడ, భారతదేశం పూర్తిస్థాయిలో సంయమనం కొనసాగిస్తోంది. అదే సమయంలో పాకిస్తాన్‌, రెచ్చగొట్టే చర్యల్ని ఇంకా ఇంకా కొనసాగిస్తూనే వుంది. 

సరిహద్దుల్లో గడచిన రెండు మూడు నెలలుగా కాల్పుల విరమణ ఒప్పందాల్ని ఉల్లంఘించి మరీ హెవీ ఫైరింగ్‌కి పాల్పడుతున్న పాకిస్తాన్‌, తాజాగా ముగ్గురు భారత సైనికుల్ని బలిగొంది. అందులో ఒకరి మృతదేహాన్ని అత్యంత కిరాతకంగా 'ముక్కలు' చేసింది. ఈ ఘటన భారత సైన్యంలో ఆగ్రహావేశాల్ని రగుల్చుతోంది. దెబ్బకు దెబ్బ తీస్తామంటూ పాకిస్తాన్‌ సైన్యానికి హెచ్చరికలు కూడా పంపింది. మరోవైపు, పరిస్థితిని భారత సైన్యం భారత రక్షణ శాఖకు వివరించింది. 

ఇప్పటికే రక్షణ మంత్రి మనోహర్‌ పారికర్‌, పాకిస్తాన్‌ సైన్యంపై ప్రతిదాడుల విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గవద్దనీ, తుపాకీ పట్టుకుని తీవ్రవాదులొచ్చినా, సరిహద్దుల్లోకి పాకిస్తాన్‌ సైన్యం వచ్చినా కాల్చి పారెయ్యాలనీ ఆదేశాలు జారీ చేశారు. ఈ హెచ్చరికల తర్వాతే పాకిస్తాన్‌ నుంచి, భారత సైన్యంపై దాడి జరగడం గమనార్హం. దాంతో, ఇప్పటికిప్పుడు పాకిస్తాన్‌పై బదులు తీర్చుకోవాల్సిన అవసరం ఏర్పడింది. 

గడచిన రెండు మూడు నెలల్లో భారత్‌ - పాక్‌ సరిహద్దుల్లో కాల్పులు సర్వసాధారణమైపోయాయి. భారత పౌరులు పలువురు ఈ కాల్పుల్లో మృత్యువాత పడ్తున్నారు. భారత సైన్యం, పాక్‌ దాడుల్ని తిప్పి కొడుతూ, పాకిస్తాన్‌ సైన్యాన్ని మట్టుబెడుతున్నా.. సరిహద్దుల్లో ఈ కాల్పులు ఓ ప్రసహనంగా మారిపోయాయి. ఇంకోపక్క జమ్మూకాశ్మీర్‌లోనూ తీవ్రవాదుల ఘాతుకాలు రోజురోజుకీ పెరిగిపోతూనే వున్నాయి. ఈ పరిస్థితుల్లో పాకిస్తాన్‌ఫై యుద్ధం చేయడమే బెటరన్న అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. 

అయినప్పటికీ కూడా, భారత్‌ శాంతికాముక దేశమే. అక్కడే వస్తోంది చిక్కు అంతా. అయినాసరే, ఇంకెన్నాళ్ళు.? ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు పాకిస్తాన్‌పై ప్రతీకారం.? అన్నది సగటు భారతీయుడి ప్రశ్న. పాపిస్తాన్‌ పాపం పండిపోవాలి కదా.! ఆ రోజెప్పుడొస్తుందో వేచి చూడాల్సిందే.

Show comments