హీరోగా చిరంజీవి రీ-ఎంట్రీకి అభిమానులు ఈ స్థాయిలో స్పందిస్తారని బహుశా 'ఖైదీ నెంబర్ 150' సినిమా యూనిట్ భావించి వుండకపోవచ్చేమో.! చిరంజీవి మాటల్లో అయితే, 'నేను మాత్రం ఈ స్థాయిలో రెస్పాన్స్ ఊహించలేదు' అన్న మాట పదే పదే విన్పిస్తోంది. అది నిజమే కూడా. ఎలాగైతేనేం, 'ఖైదీ నెంబర్ 150' సినిమా అంచనాల్ని మించిన విజయాన్ని అందుకుంది. వసూళ్ళ ప్రభంజనమైతే కొనసాగుతోందని నిర్మాత రామ్చరణ్ చెబుతున్నాడు.
ఇక, ఈ జోష్ ఇలా కొనసాగేందుకుగాను, అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపేందుకుగాను, అభిమానులతో కలిసి ఓ 'థ్యాంక్స్ మీట్'ని ఏర్పాటు చేయాలని 'ఖైదీ' టీమ్ భావిస్తోందట. ఈసారి హైద్రాబాద్లోనే ఈ ఈవెంట్ని నిర్వహించేందుకు తెరవెనుక కసరత్తులు కూడా ప్రారంభమయినట్లు తెలుస్తోంది. అల్లు అరవింద్ పర్యవేక్షణలోనే దీనికి రూపకల్పన జరుగుతోందట.
ఇదిలా వుంటే, ఈసారి ఎలాగైనా 'ఖైదీ' ఈవెంట్కి తమ్ముడు పవన్కళ్యాణ్ని తీసుకురావాలన్నది అన్నయ్య చిరంజీవి ఆలోచనగా కన్పిస్తోంది. కానీ, పవన్కళ్యాణ్ నుంచి సానుకూల స్పందన వస్తుందా.? అన్నది ప్రస్తుతానికైతే మిలియన్ డాలర్ల ప్రశ్న. పవన్కళ్యాణ్ ఒప్పుకోవడం, ఒప్పుకోకపోవడమ్మీదనే ఈ కార్యక్రమం ఫైనల్ అయ్యే అవకాశం వుందట.