జక్కన్న కోసం జోరుగా పైరవీలు

బాహుబలి - ది కంక్లూజన్ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో మనం చూశాం. ఆ సినిమా సాధిస్తున్న వసూళ్లను చూస్తూనే ఉన్నాం. మరి ఇలాంటి సెన్సేషనల్ సినిమా తీసిన రాజమౌళితో సినిమా చేయాలని ఎవరికి ఉండదు చెప్పండి. అందుకే జక్కన్నతో నెక్ట్స్ సినిమా చేసేందుకు చాలామంది ఇప్పటికే పైరవీలు ప్రారంభించారు.

పరిచయమున్న కొందరు హీరోలు నేరుగా జక్కన్నతోనే సంప్రదింపులు జరుపుకుంటే, నేరుగా మాట్లాడలేని మరికొందరు విజయేంద్ర ప్రసాద్, కీరవాణి ద్వారా చర్చలు సాగిస్తున్నారు. రాజమౌళి-ఎన్టీఆర్ కాంబినేషన్ లో సినిమా రాబోతోందనే న్యూస్ నిన్నంతా సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. దీనికి కారణం వీళ్లిద్దరూ క్లోజ్ గా ఉండడమే. జై లవకుశ కంప్లీట్ అయిన వెంటనే రాజమౌళి డైరక్షన్ లో తారక్ సినిమా ఉంటుందని టాక్.

మరోవైపు నాగార్జున కూడా రాజమౌళి నెక్ట్స్ ప్రాజెక్టు గురించి ఆరా తీస్తున్నాడు. రాజమౌళి-అఖిల్ కాంబినేషన్ సెట్ చేయాలని నాగ్ ఎప్పట్నుంచో భావిస్తున్నారు. ఐదేళ్లుగా బాహుబలి ప్రాజెక్టుతో జక్కన్న బిజీ అయిపోవడంతో అది సాధ్యం కాలేదు. ఇప్పుడు టైం వచ్చింది. అందుకే నాగ్.. తనకు క్లోజ్ గా ఉండే రాఘవేంద్రరావు, కీరవాణి లాంటి ప్రముఖులతో సంప్రదింపులు సాగిస్తున్నారట. 

మరోవైపు కొంతమంది బడా నిర్మాతలు రాజమౌళికి ఓపెన్ ఆఫర్లు ఇస్తున్నారు. తమ బ్యానర్ లో సినిమా చేయాలని.. హీరో ఎవరైనా, స్టోరీ ఏదైనా, ఖర్చు ఎంతైనా ఓకే అని ఊరిస్తున్నారు. వీళ్లలో కొందరు.. కథా రచయిత, రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ తో లాబీయింగ్ చేస్తున్నారు.  

ఓ వైపు ఇలా వందల కోట్ల రూపాయలతో నిర్మాతలు, హీరోలు రెడీగా ఉంటుంటే.. మరోవైపు రాజమౌళి తన పాత పంథాలో చిన్న సినిమా చేస్తాడేమో అనే ఉద్దేశంతో నాని, సునీల్ లాంటి హీరోలు కూడా ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇలాంటి ఒకరిద్దరు హీరోలు ఎవర్నీ నేరుగా సంప్రదించనప్పటికీ.. "ఏమో గుర్రం ఎగరావచ్చు" అనే టైపులో ఆశగా జక్కన్న వైపు చూస్తున్నారు.

Show comments