గోపీచంద్‌ సినిమాలకి ఏమయ్యింది.?

'ఆక్సిజన్‌' సినిమాకేమో సరిగ్గా ఆక్సిజన్‌ అందడంలేదు.. 'గౌతమ్‌నందా' సినిమా ఫొటోలతోనే సరిపెట్టేస్తోంది.. ఎప్పుడో విడుదల కావాల్సిన 'ఆరడుగుల బుల్లెట్‌' విడుదల ముంగిట మరోమారు వివాదాల్ని ఎదుర్కొంటోంది. అసలు గోపీచంద్‌ సినిమాలకేమయ్యింది.? ఇదే ఇప్పుడు సినీ పరిశ్రమలో హాట్‌ టాపిక్‌. 

బి.గోపాల్‌ దర్శకత్వంలో గోపీచంద్‌ హీరోగా సినిమా ఎప్పుడో పూర్తయిపోయింది. నయనతార ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించింది. 'సినిమాల్లో నటిస్తా.. ప్రమోషన్‌ మాత్రం కుదరదు..' అని ఎప్పుడో ఫిక్సయిపోయిన నయనతార, ఈ సినిమా ప్రమోషన్‌లో ఎక్కడా కన్పించదనుకోండి.. అది వేరే విషయం.

నిజానికి ఈ సినిమాకి ముందు పలు టైటిల్స్‌ అనుకున్నారు. చివరికి 'ఆరడుగుల బుల్లెట్‌'గా ఫిక్సయ్యింది. సినిమా చేస్తున్న సమయంలో నయనతార తీరు బాగానే వుండేది. ఆ తర్వాతే ఆమెకు 'టెక్కు' ఎక్కువైపోయింది. నయనతార ఐరన్‌ లెగ్‌ అనుకోవాలో, గోపీచంద్‌ బ్యాడ్‌ లక్‌ అనుకోవాలో.. కారణమేదైతేనేం ఇంకా 'ఆరడుగుల బుల్లెట్‌'కి మోక్షం లభించేలా కన్పించడంలేదు. 

తాజాగా, ఈ సినిమాకి సంబంధించి ఎన్నారై సహదేవ్‌ పోలీసుల్ని ఆశ్రయించారు. నిర్మాతలు సి.కళ్యాణ్‌, తాండ్ర రమేష్‌ తన వద్ద సినిమా కోసం 6 కోట్లు తీసుకుని, చెల్లించలేదన్నది సహదేవ్‌ ఆరోపణ. సినీ పరిశ్రమలో ఇలాంటి వివాదాలు కొత్తేమీ కాదు.

కానీ, మూలిగే నక్క మీద తాటికాయ పడ్డ చందాన అసలే ముక్కీ మూలిగీ నానా తంటాలూ పడి ఎలాగోలా సినిమా విడుదలవుతుందనుకున్న వేళ, 'ఆరడుగుల బుల్లెట్‌'కి ఈ షాక్‌ తగలడంతో, ఆ ఎఫెక్ట్‌ హీరో గోపీచంద్‌ ఇమేజ్‌ మీద చాలా గట్టిగా పడబోతోందన్నది నిర్వివాదాంశం. 

ఆరడుగుల బుల్లెట్‌ పరిస్థితి ఇలా వుంటే, 'గౌతమ్‌ నందా' సినిమా టీజర్‌ అతి త్వరలో విడుదల కాబోతోంది. సంపత్‌ నంది ఆ చిత్రానికి దర్శకుడు. 

Show comments