ఆ డైలాగ్ తీయలేదు.. అలాగే ఉంచేశారు!

"అమ్మాయిలు మనశ్మాంతికి హానికరం".. మొత్తం వివాదం అంతా ఈ ఒక్క డైలాగ్ నుంచే మొదలైంది. ఈ డైలాగ్ పట్టుకొనే యాంకర్లు షో చేయడం, దానికి చలపతిరావు రియాక్ట్ అవ్వడం, అది పెద్ద వివాదం సృష్టించడం తెలిసిందే. అంతటి వివాదానికి కారణమైన ఆ డైలాగ్ ను సినిమాలోంచి కట్ చేసి ఉంటారని అంతా ఊహించారు. కానీ రారండోయ్ వేడుక చూద్దాం సినిమాలో ఆ డైలాగ్ ఉంది. 

సినిమా విడుదలకు ముందే ఆ డైలాగ్ పై క్లారిటీ ఇచ్చాడు హీరో నాగచైతన్య. ఆ డైలాగ్ ను తొలిగించలేదని, ఉంచామని స్పష్టంచేశాడు. నిజానికి ట్రయిలర్ లో చూస్తే అదేదో కావాలని పెట్టినట్టు అనిపిస్తోందని.. కానీ సినిమాలో మాత్రం ఫ్లోలో ఇలా వచ్చి అలా వెళ్లిపోతుందని అంటున్నాడు చైతూ. అందుకే ఆ డైలాగ్ తీయలేదంటున్నాడు.

నిజంగా అది వివాదం సృష్టిస్తుందని తామెవరం అనుకోలేదని, సినిమాలో సందర్భాన్ని బట్టి, ఆ క్యారెక్టర్ అలా రియాక్ట్ అవుతుందని నాగచైతన్య వివరణ ఇచ్చాడు. సినిమా చూసిన ప్రతి ఒక్కరు ఆ సన్నివేశంతో కనెక్ట్ అవుతారని, ఈ వివాదం థియేటర్లలో గుర్తుకురాదని అంటున్నాడు నాగచైతన్య. అన్నపూర్ణ స్టుడియోస్ బ్యానర్ పై నాగార్జున నిర్మించిన ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది.

Show comments