జక్కన్న రాజమౌళిని, సంగీత మాంత్రికుడు కీరవాణి ఏడిపించేశాడు. తమ్ముడ్ని, అన్నయ్య ఏడిపించడమేంటి.? అవును, నిజమే.. కీరవాణి అభిమానంతో రాజమౌళిని ఏడిపించేశాడు. తన దీవెనలు అందిస్తూ, కీరవాణి పొగిడేస్తోంటే.. రాజమౌళి తీవ్రమైన భావోద్వేగానికి గురయ్యాడు. రాజమౌళి కోసం 'ఎవ్వడంటే ఎవ్వడనీ..' అనే 'బాహుబలి' పాటని లిరిక్స్ మార్చి, కీరవాణి సర్ప్రైజ్ ఇస్తే.. అలాగే వుంటుంది మరి.
'బాహుబలి ది కంక్లూజన్' ప్రీ రిలీజ్ ఈవెంట్లో చోటు చేసుకుంది ఈ అరుదైన సంఘటన. వేదికపై ప్రతి ఒక్కరూ రాజమౌళిని దేశంలోనే కాదు, ప్రపంచంలోనే మేటి సినీ దర్శకుల్లో ఒకడని పొగుడుతోంటే, రాజమౌళి చిన్న చిరునవ్వుతోనే సరిపెట్టాడు తప్ప.. ఎలాంటి భావోద్వేగానికీ లోను కాలేదు. అయితే, కీరవాణి అలా స్టేజ్ ఎక్కడం.. తన మీద పాట కట్టి, పాడేయడంతో రాజమౌళి ఒక్కసారిగా షాక్కి గురయ్యాడు.
'ఇంకా ఇంకా ఎదుగుతూనే వుండాలి.. ఎదుగుతూనే వున్నా, ఒదిగి వుండడమే ఈ రోజు ఈ ఘనతకు కారణం..' అంటూ రాజమౌళిని, కీరవాణి దీవించారు. కీరవాణి సర్ప్రైజ్కి.. రాజమౌళి కంటతడి పెడితే.. కాస్సేపు 'బాహుబలి ది కంక్లూజన్' ప్రీ రిలీజ్ వేడుకలో ప్రతి ఒక్కరిలోనూ ఉద్వేగం చోటుచేసుకుంది.