కొన్ని మంచి విషయాలు, ఇంకొన్ని చెడ్డ విషయాలు.. ఏదైనాసరే విషయం విషయమే కదా. సోషల్ మీడియాలో ఇప్పుడు సైఫ్ - కరీనా జంట ట్రెండింగ్గా మారింది. వీరిద్దరే కాదు, వీరి పుత్రరత్నం తైమూర్ కూడా అప్పుడే సోషల్ మీడియాలో ట్రెండింగ్ 'సబ్జెక్ట్' అయిపోయాడు. పుట్టిన వెంటనే పేరు ప్రచారంలోకి రావడంతో సైఫ్ - కరీనాల పుత్రరత్నం 'తైమూర్' గురించి ఓ రేంజ్లో రచ్చ జరుగుతోంది.
తైమూర్ ఓ చక్రవర్తి. రాజ్య విస్తరణ కాంక్షతో రక్తం ఏరులై పారించాడు. ఈ క్రమంలో చాలామందిని పొట్టన పెట్టుకున్నాడు. ఇందులో హిందువులే ఎక్కువన్నది చాలామంది వాదన. ఇంకేముంది, 'ఇలాంటి పేరు పెడతారా.?' అంటూ విమర్శనాస్త్రాలు షురూ చేశారు. కొందరైతే, 'కరీనా - సైఫ్ల కుమారుడు తైమూర్కి క్యాన్సర్ వచ్చి చనిపోతే బావుండేది..' అంటూ ఆక్రోశం, అసహనం వెల్లగక్కారు.
సినీ రంగంలో ఇటు కరీనా కపూర్, అటు సైఫ్ అలీఖాన్ ఎన్నో గాసిప్స్ని ఎదుర్కొన్నారు. చాలా వివాదాల్ని ఫేస్ చేశారు కూడా. అలాగని, అంత లైట్ తీసుకునే విషయం కాదు 'తైమూర్' వివాదం. అయినాసరే, లైట్ తీసుకోకతప్పని పరిస్థితి. ఈ వివాదం సంగతెలా వున్నా, తొలిసారి సైఫ్ - కరీనా తమ కుమారుడు తైమూర్తో కలిసి ఫొటోలకు పోజులిచ్చారు. అటు తైమూర్ వివాదం.. ఇటు సైఫ్ - తైమూర్ - కరీనా ఫొటోలు.. ఇవన్నీ ఇప్పుడు సోషల్ మీడియాలో సూపర్ ట్రెండింగ్గా మారాయి.