పదే పదే చెప్పిన మాటే చెప్పి.. మళ్ళీ మళ్ళీ చెప్పి.. చిరాకు పుట్టించేస్తోంటే 'పాడిందే పాటరా డాష్ డాష్ డాష్' అని అంటుంటాం. ఇప్పుడు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు పరిస్థితి కూడా ఇలాగే తయారయ్యింది. ప్రత్యేక హోదా అంశాన్ని ఆల్రెడీ నీరుగార్చేసిన వెంకయ్యనాయుడు, డ్యామేజీ కంట్రోల్ చర్యల్లో భాగంగా బుకాయింపుల పర్వానికి తెరలేపారు.
పిలిచినా, పిలవకపోయినా, తన అవసరం వున్నా, లేకపోయినా.. ఎక్కడికంటే అక్కడికి వెళ్ళి ఆంధ్రప్రదేశ్ని ఉద్ధరించేస్తున్నామంటూ ఊకదంపుడు ప్రసంగాలు చేసేస్తున్నారు వెంకయ్యనాయుడు. ఆయన మెప్పు కోసం, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పడ్తున్న పాట్లు చూసి, జనం ఫక్కున నవ్వుకుంటున్నారు. ఈ రోజు ఒకేసారి రెండు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు వెంకయ్యనాయుడు. కృష్ణా జిల్లాలో బెల్ యూనిట్కి శంకుస్థాపన చేశారాయన. అలాగే, తూర్పుగోదావరి జిల్లాలోని మధురపూడి (రాజమండ్రి) విమానాశ్రయ విస్తరణ కార్యక్రమంలోనూ ఆయన పాల్గొన్నారు.
వాస్తవానికి బెల్ యూనిట్ శంకుస్థాపన వెంకయ్యనాయుడు పరిధిలోనిది కాదు. మధురపూడి విమానాశ్రయ విస్తరణ వ్యవహారం కూడా వెంకయ్య నాయకుడు పరిధిలోనిది కాదు. రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన బెల్ యూనిట్, పౌర విమానయాన శాఖకు చెందిన విస్తరణ క్యాక్రమాల్లో వెంకయ్యనాయుడు పాల్గొనడం తప్పేమీ కాదు. ఎందుకంటే ఆయన కేంద్ర మంత్రి. అయితే, ఈ సందర్భంగా వెంకయ్య ఊకదంపుడు ప్రసంగంతో, ఈ సమావేశానికి వచ్చిన సాధారణ ప్రజానీకం (ఇందులో మెజార్టీ ప్రజలు తరలించబడ్డవారేననుకోండి.. అది వేరే విషయం) చాలా చాలా బోర్ ఫీలవ్వాల్సి వచ్చింది. ఓ వైపు పెద్దల ప్రసంగాలు, ఇంకో వైపు, జనం అక్కడి నుంచి జారుకోవడాలు.. ఇదీ జరిగిన తతంగం.
వెనకటికి ఒకడు ఏ విషయమ్మీద మాట్లాడాలన్నా, ఆ విషయం మొదలు పెట్టి, ఆవు దగ్గర ముగించేవాడట. అలా వెంకయ్యనాయుడు కూడా ప్యాకేజీ కథ చెబుతున్నారు. అక్కడ అది చేశాం, ఇక్కడ ఇది చేస్తున్నాం.. మధ్యలో తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్ గోలేంటి.? అని ప్రశ్నించేస్తున్నారు వెంకయ్య. అధికారిక కార్యక్రమంలో ఈ ప్యాకేజీ కథ ఎంత చికాకు తెప్పిస్తోంటే, ఆ వేదిక మీద వున్న టీడీపీ నేతలు సైతం విస్తుపోవాల్సి వస్తోంది. రాజమండ్రి విమానాశ్రయ విస్తరణ కార్యక్రమంలో అయితే, అశోక్ గజపతిరాజుకి ప్రాధాన్యత తగ్గి, వెంకయ్య అతి ఎక్కువైపోయింది.
అన్నట్టు, వెంకయ్యనాయుడు ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు ప్రాతినిథ్యం వహించడంలేదండోయ్. అయినా, ఆయనే ఆంధ్రప్రదేశ్కి పెద్ద దిక్కు. సారీ సారీ ఆంధ్రప్రదేశ్ బీజేపీకి పెద్ద దిక్కు. ఆయన తప్ప, ప్యాకేజీ గురించి అంత గొప్పగా ఏపీ బీజేపీ నేతల్లో మిగతా ఎవరూ మాట్లాడలేని పరిస్థితి. ఏం మాట్లాడతారు.? రైల్వే జోన్ విషయంలో విశాఖ ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబుకి దిమ్మ తిరిగే దెబ్బ తగిలాక.!