ధోనీ మాజీ ప్రియురాలు.!

ఎనిమిదేళ్ళ క్రితం అంటే లక్ష్మీరాయ్‌కి అంతగా ఫాలోయింగ్‌ లేదు. తెలుగులో 'కాంచనమాల' అనే సినిమా చేసిందిగానీ, ఆ సినిమాతో ఆమెకు వచ్చిన గుర్తింపు ఏమీ లేదు. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ పుణ్యమా అని లక్ష్మీ రాయ్‌ పేరు మార్మోగిపోయింది. ఆ సమయంలో ధోనీతో, లక్ష్మీ రాయ్‌ డేటింగే చేసిందో, కేవలం స్నేహమే చేసిందో.. అసలు వీరిద్దరి మధ్యా స్నేహం లేదా ప్రేమ వుందో లేదోగానీ, ధోనీ పేరు చెప్పి బాగానే పాపులర్‌ అయ్యిందామె. 

అది గతం. ఇఫ్పుడు పరిస్థితి వేరు. లక్ష్మీరాయ్‌, 'కాంచన' తదితర సినిమాల్లో నటించింది. తెలుగులో రెండు సినిమాల్లో ఐటమ్‌ సాంగ్స్‌ కూడా చేసింది. ఒకప్పటితో పోల్చితే, ఇప్పుడు హీరోయిన్‌గా ఓ మోస్తరు గుర్తింపు ఆమెకి వుంది. అందుకే, ధోనీతో ఒకప్పటి తన స్నేహం గురించి అంతగా చెప్పుకోవాలని ఆమె ఏమీ తాపత్రయపడ్డంలేదు. అయితే, అనూహ్యంగా ఆమె పేరు వార్తల్లోకెక్కింది. కారణం 'ఎంఎస్‌ ధోనీ: ది అన్‌ టోల్డ్‌ స్టోరీ' సినిమా విడుదలవుతుండడమే. ఇది ధోనీ బయోపిక్‌ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు కదా. 

క్రికెటర్‌ ధోనీకి సంబంధించి అనేక ఆసక్తికరమైన విషయాలు ఈ సినిమా ద్వారా తెలుసుకోవచ్చట. అవి ఇప్పటిదాకా ఎవరికీ తెలియని విశేషాలట. దాంతో లక్ష్మీ రాయ్‌ కూడా ఒకింత కంగారుపడ్తోందంటూ గుసగుసలు విన్పిస్తున్న వేళ, ఆమె క్లారిటీ ఇచ్చేసింది. ఈ సినిమా నిర్మాణ సమయంలో చిత్ర దర్శక నిర్మాతలు కాకుండా, కొందరు ఆ చిత్రం పేరు చెప్పి తనను అప్రోచ్‌ అయ్యారనీ, ధోనీ గురించి తనకు తెలిసిన విషయాలు చెప్పమన్నారనీ, తాను తనకు తెలిసింది చెప్పాననీ అంటోందామె. 

అయితే, ధోనీతో తనకు ఎలాంటి ఎఫైర్‌ లేదనీ, కేవలం స్నేహం మాత్రమే వుండేదనీ, అది కూడా ఎనిమిదేళ్ళ క్రితం అనీ, ఆ తర్వాత ధోనీని ఎప్పుడూ కలవలేదని చెబుతోంది లక్ష్మీ రాయ్‌. అందరిలాగానే, తాను కూడా 'ఎంఎస్‌ ధోనీ: ది అన్‌ టోల్డ్‌ స్టోరీ' సినిమా విడుదల కోసం ఎదురుచూస్తున్నానని అంటోన్న లక్ష్మీ రాయ్‌, తన ప్రస్తావన సినిమాలో వుండదనే భావిస్తున్నట్లు చెప్పుకొచ్చింది.

Show comments