సోషల్ మీడియా సెలబ్రిటీలకు 'పబ్లిసిటీ కోసం' భలేగా ఉపయోగపడ్తోంది. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఈ మధ్యనే తన కాలికి సర్జరీ అయిన విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించిన విషయం విదితమే. సచిన్కి ఏమయ్యింది.? అంటూ ఆ ఫొటోని చూసి అంతా షాక్కి గురయ్యారు. క్రికెటర్లకి గాయాలు మామూలే.. అవి తిరగబెట్టడమూ మామూలే. సచిన్ విషయంలోనూ అదే జరిగింది. ఇప్పుడంతా హ్యాపీస్.. అని సచిన్ సోషల్ మీడియా ద్వారా అభిమానుల టెన్షన్ తగ్గించాడు.
ఇక, తాజాగా ఛార్మి కూడా కాలికి బ్యాండేజ్తో ఫొటోని సోషల్ మీడియాలో పెట్టింది. ఆమె కాలు విరిగిందట. విరగ్గొట్టిందెవరో కాదు, ఇంకో హీరోయిన్ అమైరా దస్తర్. వీరిద్దరూ ఏం పోట్లాడుకున్నారో ఏమోననే కదా మీ డౌట్. ఓ సినిమాలో వీరిద్దరూ కలిసి నటిస్తున్నారు. ఆ సినిమా షూటింగ్ సమయంలో అమైరా దస్తర్ కారణంగా ఛార్మి కాలికి గాయమయ్యిందట. అదీ అసలు విషయం.
సోషల్ మీడియాలో యాక్టివ్గా వుండే సెలబ్రిటీలలో ఛార్మి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. చీమ చిటుక్కుమన్నా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పడేస్తుంది ఛార్మి. ఇదో టైపు పబ్లిసిటీ. సినిమా అవకాశాలు తగ్గాక నిర్మాతగా మారిన ఛార్మి, సోషల్ మీడియాలోనూ స్టార్ అనిపించేసుకుంటోంది. సెలబ్రిటీలన్నాక ఆ మాత్రం పబ్లిసిటీ లేకపోతే ఎలా.?