బాలయ్య దెబ్బ.. తగిలింది గంటాకా, చిరంజీవికా?

తెలుగుదేశం పార్టీ విశాఖ తీరంలో తుపానును సృష్టించిన విశాఖ ఫిల్మ్ ఛాంబర్స్ క్లబ్ వివాదం ఒక కొలిక్కి వచ్చింది. ఈ క్లబ్ కు భూ కేటాయింపులను రద్దు చేసింది ఏపీ ప్రభుత్వం. ఇప్పటికే శంకుస్థాపన జరిగినా, ఆ శంకుస్థాపన చేసింది స్వయానా బాబు గారే  అయినా.. ప్రభుత్వం భూ కేటాయింపులను రద్దు చేయడం ఆసక్తిదాయకంగా ఉంది.

ఇంతకు మించిన ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. ఈ ఫిల్మ్ క్లబ్ వ్యవహారంలో చిరంజీవి, బాలకృష్ణ ల పేర్లు వినిపిస్తూ ఉండటం. శంకు స్థాపన జరిగిన ఈ క్లబ్ కు భూ కేటాయింపులు రద్దుకావడం చిరంజీవికి ఒక విధంగా షాకే అనే మాట వినిపిస్తోంది. స్వయంగా బాలకృష్ణ రంగ ప్రవేశం చేసి భూ కేటాయింపు రద్దులో క్రియాశీల పాత్ర పోషించాడని టాక్.

విశాఖ తెలుగుదేశం రాజకీయాల్లో మంత్రి గంటా శ్రీనివాసరావుకు, అయ్యన్నపాత్రుడికి మధ్య ఉన్న విబేధాలు కొత్తేమీ కాదు. ఫిల్మ్ క్లబ్ వ్యవహారంలో కూడా వారి మధ్యన విబేధాలే కొనసాగాయి. కొన్ని రోజుల క్రితం చంద్రబాబు కొంతమంది సినీ ప్రముఖులతో కలిసి విశాఖలో ఫిల్మ్ క్లబ్ కు శంకుస్థాపన చేశాడు. కార్యక్రమం గంటా ఆధ్వర్యంలో జరగడంతో.. దీనికి తెడ్డెం అంటూ.. అయ్యన్నపాత్రుడు అక్కడ ఆ నిర్మాణాన్ని వ్యతిరేకించాడు. 

ఈ విషయంలో అయ్యన్నపాత్రుడి వర్గం రోడ్డుకు ఎక్కింది. ప్రజా సంఘాల పేరుతో ఉద్యమం మొదలైంది. అలాగే గంటాకు చెక్ చెప్పడానికి బాలయ్య రూట్లో వెళ్లాడు అయ్యన్న. చిరంజీవికి గంటా ఎంత సన్నిహితుడో చెప్పనక్కర్లేదు, ఈ పాయింట్ ను వాడుకొంటూ, ఫిల్మ్ క్లబ్ శంకుస్థాపనకు బాలయ్యకు ఆహ్వానం దక్కలేదన్న విషయాన్ని గుర్తు చేస్తూ.. అయ్యన్న నందమూరి నటసింహాన్ని రెచ్చగొట్టినట్టు సమాచారం. ఫిల్మ్ ఛాంబర్స్ క్లబ్ కు కేటాయించిన భూమి విలువ పదిహేను వందల కోట్లు అని, దీంట్లో గంటా, చిరంజీవి ప్రయోజనాలు ముడిపడి ఉన్నాయని అయ్యన్న బాలయ్యకు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది.
  
దీంతో బాలయ్య లోకేష్ ద్వారా చంద్రబాబుపై ఒత్తిడి తెచ్చి విశాఖ ఫిల్మ్ క్లబ్ కు భూ కేటాయింపులు రద్దు చేయించాడనే మాట వినిపిస్తోంది.  ఒకవైపు గంటా శ్రీనివాసరావు విదేశీ పర్యటనలో ఉండగా.. ఫిల్మ్ క్లబ్ కు భూ కేటాయింపులు రద్దు అయిన విషయాన్ని ప్రకటించారు. 

ఇది కేవలం గంటాకు తగిలిన ఎదురుదెబ్బ కాదు.. బాలయ్య దగ్గర చిరంజీవిని బూచిగా చూపించి అయ్యన్న కొట్టించిన దెబ్బ అనేది స్పష్టం అవుతోంది. 

Show comments