దిలీప్ మల్టీప్లెక్స్ క్లోజ్.. మరిన్ని చిక్కుల్లో మలయాళీ నటుడు

తాజాగా మరో రెండు దెబ్బలు తగిలాయి మలయాళ నటుడు దిలీప్ కు. అతడికి బెయిల్ ఇవ్వడానికి కేరళ హైకోర్టు మరోసారి నిరాకరించింది. అంతేకాదు.. జ్యూడిషియల్ కస్టడీని ఈనెల 8వ తేదీ వరకు పొడిగించింది. మరోవైపు దిలీప్ కు చెందిన ఓ భారీ మల్టీప్లెక్సును మూసివేసేందుకు అధికారులు సిద్ధమౌతున్నారు.

నిజానికి ఈ కేసుకు, దిలీప్ కు చెందిన సినిమాహాల్ కు ఎలాంటి సంబంధం లేదు. కానీ రోజులు బాగాలేకపోతే ఏదీ కలిసి రాదంటారు కదా.. అలా ఈ బ్యాడ్ టైమ్ లో సినిమా హాల్ కూడా మూతపడబోతోంది. కేరళ త్రిచూర్ జిల్లాలోని చాళకుడిలో డి-సినిమాస్ అనే భారీ మల్టీప్లెక్స్ ఉంది. అది దిలీప్ దే. ఆ మల్టీప్లెక్సును నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారని తేల్చారు మున్సిపల్ అధికారులు. ఈ మేరకు థియేటర్లను మూసేయాల్సిందిగా ఈరోజు నోటీసులు అందించబోతున్నారు. ఇప్పటికే సగం ఆదాయాన్ని కోల్పోయిన దిలీప్ కు ఇది మరో ఎదురు దెబ్బ.

నటి భావనపై లైంగిక దాడి కేసులో అరెస్టయ్యాడు దిలీప్. ఆరుగురు నిందితులు ఇచ్చిన సమాచారం ఆధారంగా దిలీప్ ను అరెస్ట్ చేశారు పోలీసులు. తాజాగా ఈ కేసుకు సంబంధించి నటి ముంజు వారియర్ సోదురుడ్ని పోలీసులు ప్రశ్నించారు. దిలీప్ కు వ్యతిరేకంగా మరిన్ని సాక్ష్యాలు నమోదు చేశారు. ఈ కేసులో మంజు వారియర్ వాంగ్మూలాన్ని కూడా సేకరించారు. 

దిలీప్, మంజు వారియర్ ఒకప్పుడు భార్యభర్తలు. రెండేళ్ల కిందట మంజు వారియర్ కు విడాకులిచ్చి మరో హీరోయిన్ కావ్య మాధవన్ ను పెళ్లిచేసుకున్నాడు దిలీప్. అయితే మంజు వారియర్, దిలీప్ కు మొదటి భార్య కాదని, అతడికి అంతకుముందే మరో మహిళతో వివాహం అయిందని పోలీసులు తాజాగా జరిపిన పరిశోధనలో తేల్చారు. మొదటి భార్యకు అధికారికంగా విడాకులు ఇవ్వకుండానే.. మంజు వారియర్ ను పెళ్లాడి, ఆమెకు విడాకులిచ్చి ఇప్పుడు కావ్య మాధవన్ తో కాపురం చేస్తున్నాడని పోలీసులు అంటున్నారు. 

Show comments