సినిమాకి హీరోయిన్గా గ్లామరద్దడమే కాదు.. సినిమాకి సంబంధించిన 'గ్రామరూ' తనకు తెలుసంటోంది 'కొత్తబంగారు లోకం' ఫేం శ్వేతాబసు ప్రసాద్. వరుణ్ సందేశ్ హీరోగా నటించిన 'కొత్తబంగారు లోకం' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన శ్వేతాబసు ప్రసాద్, ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించినా, తొలి సినిమా తప్ప మరో సక్సెస్ ఆమె ఖాతాలో పడలేదు. ఆ తర్వాత క్రమక్రమంగా అవకాశాలు తగ్గిపోయి, చివరికి ఐటమ్ సాంగ్స్ దాకా వెళ్ళిపోయింది.
మధ్యలో ఓ 'వివాదం' కారణంగా శ్వేతాబసు ప్రసాద్ వార్తల్లోకెక్కడం, ముంబైకి చెక్కేసి.. బాలీవుడ్ సినిమాలకి 'స్క్రిప్ట్ అసిస్టెంట్'గా చేరడం తెల్సిన విషయాలే. ఇప్పుడామె, సినిమా గ్రామర్ మీద ఫోకస్ పెట్టిందట. నటిగా అవకాశాలొస్తే సద్వినియోగం చేసుకుంటూనే, రచయితగా, దర్శకురాలిగా తన సత్తా ఏంటో చాటి చెప్పడానికి సిద్ధంగా వున్నానని చెబుతోంది శ్వేతాబసు ప్రసాద్.
తెలుగు, హిందీ భాషల్లో ఓ సినిమా తెరకెక్కించాలన్నది ఆమె ఆలోచన అట. 'మిక్చర్ పొట్లం' సినిమా ప్రమోషన్ కోసం హైద్రాబాద్ వచ్చిన శ్వేత, ఓ దశలో తాను చాలా కఠినమైన సమస్యను ఎదుర్కొన్నాననీ, దాని గురించి మాత్రం తన వద్ద ప్రస్తావించొద్దని చెబుతోంది. 'ఆ ఘటనలో నా తప్పేమీ లేదు.. నేను తప్పు చేసిందే నిజమైతే.. నాతోపాటు ఇంకో వ్యక్తి కూడా తప్పు చేసి వుండాలి కదా.. నేనే ఎందుకు వార్తల్లోకెక్కాను.? ఆ వ్యక్తిని ఎందుకు దాచేశారు..' అంటూ ఆనాటి ఘటనపై అప్పట్లో శ్వేత గుస్సా అయ్యింది. అఫ్కోర్స్, అలాంటి కేసుల్లో 'పెద్దలు' ముందే తప్పుకుంటారనుకోండి.. అది వేరే విషయం. ఆ సమయంలో, తనకు అండగా వుంటానని ప్రకటించిన కొందరు సినీ ప్రముఖులు ఆ తర్వాత హ్యాండిచ్చారనీ శ్వేత వాపోయింది.