బాహుబలి-2పై బాలీవుడ్ మౌనం

ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజైన బాహుబలి-2 సినిమాను అంతా మెచ్చుకుంటున్నారు. ఇండస్ట్రీ, లాంగ్వేజ్ తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు బాహుబలి-2పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఒక్క బాలీవుడ్ తప్ప. అవును.. బాలీవుడ్ స్టార్ హీరోలు మాత్రం బాహుబలి-2కు దూరంగా ఉన్నారు. సినిమా విడుదలై ఇన్ని రోజులైనా ఒక్కరంటే ఒక్క స్టార్ కూడా దీనిపై స్పందించకపోవడం గమనార్హం.

కరణ్ జోహార్ లాంటి పెద్ద మనిషి, బాలీవుడ్ లో పలుకుబడి బాగా ఉన్న వ్యక్తి బాహుబలి-2 సినిమాను హిందీలో రిలీజ్ చేశాడు. ఇలాంటి వ్యక్తి నుంచి ఏ సినిమా వచ్చినా బాలీవుడ్ అంతా ట్వీట్ల వర్షం కురిపిస్తుంది. ఆ విషయాన్ని గతంలోనే మనం చూశాం. కానీ ఆశ్చర్యంగా బాహుబలి-2 విషయంలో మాత్రం బాలీవుడ్ మూగబోయింది. సల్మాన్, షారూక్, హృతిక్, అమీర్, అక్షయ్.. ఇలా స్టార్ హీరోలెవరూ ఈ సినిమాపై ఇప్పటివరకు రియాక్ట్ అవ్వలేదు. కనీసం కరణ్ జోహార్ చేస్తున్న ట్వీట్స్ ను రీట్వీట్ కూడా చేయలేదు. కరణ్ కు ప్రియశిష్యులుగా పేరుతెచ్చుకున్న రణ్వీర్ సింగ్, సుశాంత్ సింగ్ రాజ్ పుత్, షాహిద్ కపూర్ లాంటి హీరోలు కూడా స్పందించలేదు.

ఓ తెలుగు సినిమా బాలీవుడ్ రికార్డుల్ని తుడిచిపెడుతోంది. సల్మాన్, షారూక్ లాంటి హీరోల వల్ల కూడా సాధ్యం కాని రికార్డుల్ని సృష్టిస్తోంది. ఇలాంటి టైమ్ లో తాము ట్వీట్ చేస్తే సినిమాకు మరింత ప్రచారం వస్తుందని ఈ హీరోలు భావించి ఉండొచ్చు. కానీ బాహుబలి-2 సినిమాకు ఇప్పుడు ఎవరి సపోర్ట్ అవసరం లేదు, ఎక్స్ ట్రా ప్రమోషన్ అక్కర్లేదు. ప్రస్తుతానికి రితేష్ దేశ్ ముఖ్, అనుపమ్ ఖేర్ లాంటి నటులు మాత్రమే ఈ సినిమాపై స్పందించారు.

Show comments