ఏమిటీ 453 నాటౌట్.. టెస్ట్ క్రికెట్లో లారా వ్యక్తిగత అత్యుత్తమ స్కోరు అనుకుంటున్నారా.. కాందడీ ఇది మన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి ట్రాక్ రికార్డు. ఆ మాటకొస్తే ఇదే ఆల్టైం రికార్డు.. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక 2014 నుంచి 17 వరకూ ఒక్క కర్నూలు జిల్లాలోనే జరిగిన హత్యల సంఖ్య ఇది. ఏ నమ్మ బుద్ధి కావడం లేదా అయితే ఒక సారి మన దినపత్రికలు గానీ, పోలీసు రికార్డులు గానీ చూడండి చంద్రబాబు రికార్డులు అర్థమవుతాయి.
రౌడీయిజాన్ని సహించను.. శాంతి భద్రతలు క్షీణిస్తే క్షమించను.. చంద్రబాబు నోటి నుంచి జాలువారే ఆణిముత్యాలు ఇలా వుంటే మరో వైపు రాష్ట్రంలో అధికార పార్టీ రౌడీలు, గూండాలు రెచ్చి పోతున్నారు. దోచుకున్నోడికి దోచుకున్నంత, చంపుకున్నోడికి చంపుకున్నంత అన్నట్టు పార్టీ కార్యకర్తలకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చేయడంతో కన్నూ మిన్నూ కానక చెలరేగిపోతోంది పసుపు దళం. ఒక్క కర్నూలు లోనే మూడేళ్లలో ఇంత మంది చంద్రబాబు నేర్పిన క్రమశిక్షణను పాటిస్తున్న తమ్ముళ్ల రక్తదాహానికి బలైతే ఇక రాష్ట్రంలో ఎన్ని వందల మంది అధికార కార్యకర్తల హత్యారాజకీయాలకు నేలకొరిగుంటారో ఒకసారి ఆలోచించండి.
పోలీసులను తొత్తులుగా మార్చుకుని అధికార నేతలు సాగిస్తున్న ఆటవిక చర్యలు పచ్చ మీడియాలోనే ప్రచురితమవుతున్నాయంటే ఎంత దాచలేని నిష్ఠూర సత్యాలో పరిశీలించండి. అని ప్రతిపక్షాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ప్రాణహాని ఉందని పోలీసులకు మొరపెట్టుకున్నా భద్రత కల్పించని దుస్థితి. దానికి తోడు ఆత్మరక్షణ కోసం తెచ్చుకున్న రివాల్వర్ను కూడా పోలీసులు తిరిగి స్వాధీనం చేసుకున్నారంటే చెరుకులపాడు నారాయణరెడ్డి హత్యలో ఎంతటి కుట్ర కోణం దాగివుందనేది ఎవరికైనా ఇట్టే బోధపడుతుంది.
స్వయానా ఉపముఖ్యమంత్రి పుత్రరత్నం పైనే పోలీసులు హత్య కేసులో ప్రధాన నిందుతుడిగా కేసు నమోదు చేశారంటే ఇదేనా చంద్రబాబు బోధిస్తున్న నీతి వాక్యాలని ప్రజాస్వామ్యవాదులు మండిపడుతున్నారు. ఇక రాబోయే రోజుల్లో ఇంకెన్ని హత్యలు చూడాల్సి వస్తుందోనని వారు భయాందోళనలు వెలిబుచ్చుతున్నారు.