తెలుగుదేశం పార్టీ పండగ మహానాడు శనివారం విశాఖలో అట్టహాసంగా ప్రారంభమైంది. పండగలు చేయడం, వాటికి పబ్లిసిటీ కల్పించడంలో ఆరితేరిన చంద్రబాబు నాయుడు ఈసారి కూడా మహానాడును తెలుగు జాతి పండగ అని పచ్చ రంగును తెలుగు ప్రజలందరికీ పూసే ప్రయత్నం చేశాడు. రాష్ట్ర ప్రగతికి పునరంకితమవుదాం.. అంటూ పడికట్టు పదాల చిట్టా మళ్లీ విప్పాడు.
పార్టీ పండగ అంటే ఆ పార్టీ ప్రజలకు ఏం చేసిందనేది కూడా కాస్త వివరించాలి కదా. అందులో మూడేళ్లుగా ఏపీలో అధికారంలో ఉంది టీడీపీ. ఈ మూడేళ్ల కాలంలో ప్రజలకు ఏం చేశాం. రాబోయే రెండేళ్లలో ఏం చేయబోతున్నాం విషయంపై మాట మాత్రమైనా చెప్పకుండా ఏ కాడికీ ఎన్టీఆర్ నాటి పథకాలనే మళ్లీ గుర్తుచేసి ప్రజల్లో ఆయన పట్ల ఉన్న సానుభూతిని క్యాష్ చేసుకునే ప్రయత్నాన్నిమహానాడు వేదికగా బాబు మళ్లీ మొదలుపెట్టాడు.
ఇక పచ్చ మీడయాకు కూడా మహానాడు మహా ఉత్సవంగా మారిపోయింది. ఏం వంటలు వండారు, ఎలాంటి వెరైటీలు వడ్డిస్తున్నారు, ఎంత మంది తింటారు.. ప్రతి పేజీలో ఈ భోజనాల గోల తప్పితే పార్టీ మీద ప్రజలు ఎలాంటి నమ్మకంతో అధికారం అందించారు. వాటిని ఎంత మేరకు నెరవేర్చారు. అధికారంలోకి వచ్చాక పార్టీలో అంతర్గత కుమ్ములాటలు, కార్యకర్తలు, నేతల రౌడీయిజం, ప్రజల్లో దిగజారుతున్న పార్టీ పరువు..
వీటిపై హెచ్చరింపుగానైనా పచ్చ పత్రికలు ఒక్కటంటే ఒక్క వార్త ప్రచురించలేదు. మహానాడంటే అక్కడ వండించే వంటలు, కల్పించే సదుపాయాలు, అతిధి మర్యాదలు, ఘనమైన ఏర్పాట్లు ఇవేనా.. అని కొందరు పెదవి విరుస్తున్నారు.
గమ్మత్తేంటంటే సరిగ్గా భోజనాలకు ముందుగానే చంద్రబాబు ప్రసంగం ప్రారంభించారు. అక్కడి నోరూరుతున్న వంటకాలను చూసి ఆగలేకపోతున్న అతిధులు బాబుగారు ఎప్పుడు వదులు తారా వెళ్లి వంటల మీద పడదాం అన్నట్టు కనిపించారు.