చంద్రబాబు కేబినెట్ లోని మంత్రులకు అప్పుడే కష్టాలు మొదలయ్యాయి. తమ తమ పనితీరును నిరూపించుకోవడానికి ఇప్పుడు వారు జగన్ను ఆశ్రయిస్తున్నారు. అదే ... ఆశ్రయించడం అంటే.. జగన్ ను అతిభయంకరంగా తూలనాడడం ద్వారా.. చంద్రబాబును ప్రసన్నం చేసుకోవాలని చూస్తున్నారు. కేబినెట్ నుంచి తొలగించే అవకాశం ఉన్నదని.. మెడ మీద కత్తి వేలాడుతున్న వారిలో ఒకరైన అనంతపురానికి చెందిన పల్లె రఘునాధరెడ్డి పరిస్థితి.
చంద్రబాబు మంత్రివర్గ విస్తరణ అనే పదం కాకుండా.. మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ అనే పదం వాడడంతో.. ఉన్నవారిలో కొందరిని ఇంటికి పంపడం కూడా గ్యారంటీ అని తేలిపోయింది. చంద్రబాబు గుడ్ లుక్స్లో ఉంటే తప్ప మంత్రిపదవులు నిలబడవు అనే సంగతి అందరికీ అర్థమైంది.
ఆ కోణంలోంచి చూసినప్పుడు.. అనంతపురంలో టీడీపీ సమావేశంలో ఎడాపెడా జగన్ మీద నిప్పులు కురిపించడం మీద ఆంతర్యం అదే. ఈ కార్యకమ్రంలో జగన్ రాజకీయ సైంధవుడు అంటూ నిప్పులు చెరిగారు. ప్రజలు ఆయనను నమ్మడం లేదని, జగన్కు త్వరలోనే అంతం పలికే రోజులు త్వరలో రానున్నాయని పల్లె జోస్యం చెప్పారు. రేపు చంద్రబాబునాయుడు తమ జిల్లాకు రానున్న నేపథ్యంలో.. జగన్ ను బాగా తిడుతున్నట్లు మంచి కవరేజీలో ఉన్నట్లు కనిపిస్తే.. ఆయన దృష్టిలో పడతామని పల్లె ఈ పాట్లన్నీ పడుతున్నారని అర్థమవుతోంది. ఎంత చేసినా సరే.. ఆయన పదవిని కాపాడుకోవడం కష్టమే అని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.