ఉడ్తా టాలీవుడ్‌: పూరికి అలా శ్యామ్‌కి ఇలా

టాలీవుడ్‌లో డ్రగ్స్‌ ప్రకంపనలకు సంబంధించి ప్రముఖ దర్శకుడు పూరిజగన్నాథ్‌ని నిన్న ఎక్సయిజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ 'సిట్‌' సుదీర్ఘంగా 11 గంటల పాటు విచారించిన విషయం విదితమే. తొలి రోజు పూరిజగన్నాథ్‌ని 'సిట్‌' విచారించిన తీరుతో ఒక్కసారిగా తెలుగు సినీ పరిశ్రమలో చిన్నపాటి కుదుపు కన్పించింది. 'సిట్‌' నుంచి నోటీసులు అందుకున్న మిగతా 11మంది పరిస్థితి అయితే వర్ణనాతీతం. కానీ, చిత్రంగా రెండో రోజు విచారణ మాత్రం తక్కువ సమయానికే పూర్తయ్యింది. 

'సిట్‌' యెదుట ఈ రోజు విచారణకు హాజరయ్యారు ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌ శ్యామ్‌ కె నాయుడు. పూరిజగన్నాథ్‌కి ఈయన అత్యంత సన్నిహితుడు. ఉదయం 10.30 నిమిషాల సమయంలో 'సిట్‌' ఆఫీస్‌కి శ్యామ్‌ కె నాయుడు హాజరు కాగా, సాయంత్రం 5 గంటల సమయానికన్నా ముందే విచారణ ముగియడం గమనార్హం. విచారణకు శ్యామ్‌ సహకరించారని 'సిట్‌' అధికారులు వెల్లడించారు.

ఇక, రేపు మరో సినీ ప్రముఖుడు, నటుడు సుబ్బరాజు 'సిట్‌' యెదుట విచారణకు హాజరు కానుండగా, పూరి తరహాలో సుబ్బరాజుకి సుదీర్ఘ విచారణ తప్పదా.? శ్యామ్‌ కె నాయుడు తరహాలో తక్కవ సమయం విచారణతో సరిపెట్టేస్తారా.? అన్నది ఆసక్తికరంగా మారింది. సుబ్బరాజు తర్వాత, హీరోయిన్‌ ఛార్మి 'సిట్‌' యెదుట విచారణకు హాజరయ్యే అవకాశాలున్నాయి. లిస్ట్‌లో రవితేజ సహా నవదీప్‌, తరుణ్‌ తదితరుల పేర్లున్న దరిమిలా, వారందరూ విచారణకు హాజరు కానున్నారు.

Show comments