నాగార్జునలో ఇంత మార్పేమిటి?

సినిమాని బిజినెస్‌లానే చూసే నాగార్జున తన బ్యానర్‌పై తీసే సినిమాల విషయంలో చాలా పొదుపు పాటిస్తుంటారు. ఫీజిబుల్‌ అయిన బడ్జెట్‌ వుంటేనే ఆయన ఏ సినిమాకైనా గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తారు. భారీ సినిమాలకి వీలయినంత దూరంగా వుండే నాగ్‌ తన కొడుకుల మొదటి చిత్రాలని కూడా సొంత బ్యానర్లో తీయలేదు.

చైతన్య ఫస్ట్‌ సినిమా ఫెయిల్‌ అయినప్పటికీ అఖిల్‌ మొదటి చిత్రాన్ని మళ్లీ బయటి నిర్మాతకే ఇచ్చారు. తన సొంత సంస్థలో సినిమా తీసుకున్నట్టయితే, ఒకవేళ సినిమా బాగా రావడం లేదనిపిస్తే జరిగిన నష్టాన్ని భరించి, షూటింగ్‌ ఆపేయవచ్చు, లేదా రీషూట్‌ చేసుకోవచ్చు. బయటి బ్యానర్లలో అలాంటివి కుదరవు కదా? అది తెలిసినా కానీ అఖిల్‌ చిత్రానికి వేరే నిర్మాతకి ఇచ్చి చేదు అనుభవం ఎదుర్కొన్నారు. 

తనయులని స్టార్లుగా మలచాలంటే ఇక తాను వ్యాపార లెక్కలు చూసుకోరాదని, వారిని ఎస్టాబ్లిష్‌ చేసేందుకు ఎంత ఖర్చయినా భరించాలని నాగ్‌ డిసైడయ్యారు. అందుకే చైతన్య 'రారండోయ్‌ వేడుక చూద్దాం' చిత్రానికి రీషూట్‌ అయినా చేసుకోమంటున్నారే తప్ప కాంప్రమైజ్‌ కావడం లేదు. అలాగే అఖిల్‌ రెండో సినిమాకి కూడా దర్శకుడు విక్రమ్‌ కుమార్‌ అడిగిన దానికల్లా ఖర్చుకి వెనకాడకుండా సై అంటున్నారు. నాగ్‌లో ఈ మార్పుతో అక్కినేని యువ తరంగాలిద్దరూ పెద్ద స్టార్స్‌ అయిపోవడం తథ్యమని అభిమానులు ఆనందంగా వున్నారు.

Show comments