టీడీపీ రెడ్ల ఆధిపత్య పోరులో కొత్త ట్విస్టులు..!

రాయలసీమ రాజకీయాల్లో ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఆధిపత్య పోరు తప్ప మరేం కనిపించడం లేదు. అనంతపురం, కర్నూలు, కడప.. జిల్లాల్లోని వివిధ నియోజకవర్గాల్లో పార్టీ నేతలు కత్తులు దూసుకుంటున్నారు. ఫిరాయింపులు జరిగిని నియోజకవర్గాల్లోనే కాదు, ఎన్నికల తర్వాత కొత్తగా వచ్చి ఎవరూ చేరింది లేని నియోజకవర్గాల్లో కూడా నేతల కుమ్ములాటలు తీవ్ర స్థాయిలోనే ఉన్నాయి.

పార్టీలోనే దశాబ్దాలుగా పని చేస్తున్న నేతలు కూడా తమ పక్క నియోజకవర్గాల్లో తమ ఆధిపత్యం చెలాయించాలని చూడటం, తమ వారసులను అక్కడ బరిలో నిలపాలని యత్నించడం.. వంటి ప్రయత్నాలతో అమితుమి పోరాటాలు కొనసాగిస్తున్నారు. ఇలాంటి పోరాటాలు జరుగుతున్న నియోజకవర్గాల జాబితాను తయారు చేస్తే అది పెద్దదే అవుతుంది.

ఇక ఈ ఆధిపత్య పోరులో సరికొత్త రకం రాజకీయాలు కూడా జరుగుతున్నాయి. టీడీపీలో ఒకే నియోజకవర్గానికి చెందిన నేతల్లో.. ఒకరి వర్గం వారిని మరో వర్గం వారు తమ వైపుకు తిప్పకుంటూ.. దాన్ని కూడా పెద్ద సెలబ్రేషన్ గా చేసుకుంటున్నారు. ఉదాహరణకు ప్రొద్దుటూరు నియోజకవర్గంలో.. వరదరాజుల రెడ్డి, లింగారెడ్డిల మధ్య జరుగుతున్న పోరులో చిత్రాలు చోటు చేసుకుంటున్నాయి.

లింగారెడ్డి వర్గంలోని మనుషులుగా చెలామణి అయిన వారిని వరదరాజుల రెడ్డి తనవైపుకు తిప్పుకుంటున్నాడు. అలా తిప్పుకోవడమే కాదు.. సదరు చోటా నేతలు తన వైపుకు చేరడాన్ని ప్రత్యేక కార్యక్రమంగా నిర్వహించుకొంటున్నాడు. వేరే పార్టీ నుంచి వచ్చిన నేతలను చేర్చుకొంటూ జరిగే సెలబ్రేషన్స్ ను చూశాం కానీ, ఇలా నేతలు ఒక పార్టీలోనే ఒక వర్గం నుంచి మరో వర్గం వైపు చేరడం, దాన్ని కూడా చేరిక కార్యక్రమం లెవల్లో పండగలా నిర్వహించుకోవడం.. మాత్రం కొత్త అనే చెప్పాలి. తెలుగుదేశం పతాక స్థాయికి చేరిన ఆధిపత్య పోరులకు దర్పణం పడుతున్నాయి ఈ వ్యవహారాలు.

Show comments