మరో టీవీ జర్నలిస్టు సొంత కుంపటి!

ఇటీవలే అర్నబ్ గోస్వామి తను పని చేస్తున్న చానల్ కు రాజీనామా చేసి తన ఇమేజ్ ను ఆసరాగా చేసుకుని సొంతంగా చానల్ పెట్టుకునే యత్నాల్లో ఉండగా, ఈ జాబితాలోనే చేరింది బర్ఖా దత్. సంచలనాలకు, విమర్శలకు కేరాఫ్ బర్ఖా. దాదాపు ఇరవై ఒక్క సంవత్సరాల పాటు ఈమె ఎన్డీటీవీలో పని చేసింది. తాజాగా రాజీనామా చేసింది. ఈ విషయాన్ని ఎన్డీటీవీ ధ్రువీకరించింది. బర్ఖా అందించిన సేవలకు కృతజ్ఞతలు చెబుతూ, ఆల్ ద బెస్ట్ చెప్పింది. 

ఈ నేపథ్యంలో బర్ఖా సొంతంగా టీవీ చానల్ పెట్టుకునే అవకాశాలున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. సొంత చానల్ పెట్టుకునే ఉద్దేశంతోనే ఈమె రాజీనామా చేసిందని అంటున్నారు. అయితే బర్ఖా కొత్త చానల్ గురించి మాత్రం అధికారిక ప్రకటన లేదు. తను కొత్త అవకాశాల దిశగా వెళుతున్నట్టుగా బర్ఖా తన ఫేస్ బుక్ పేజీలో ప్రకటించింది. 

కార్గిల్ వార్ కవరేజీని చాలా ధైర్య సాహసాలతో చేసిందనే పేరును కలిగి ఉంది బర్ఖా. అలాగే ముంబై తాజ్ హోటల్ పై దాడుల విషయంలో ఈమె కవరేజీ తీరుపై విమర్శలు గుప్పుమన్నాయి. అలాగేమ కొన్ని సందర్భాల్లో ఈమెను యాంటీ నేషనల్ గా అభివర్ణించారు కొంతమంది వీర జాతీయ వాదులు. ఈ విధంగా సాగిన బర్ఖా కెరీర్ ఇకపై ఎలా ఉండబోతోందో!

Show comments